Police Rewards: నగర పోలీస్ విభాగంలో అంకితభావంతో పనిచేసే సిబ్బందిని ప్రోత్సహించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ చేపట్టిన వినూత్న కార్యక్రమం ఒక మైలురాయిగా నిలిచింది. ఆదివారం బంజారాహిల్స్లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) వేదికగా జరిగిన కార్యక్రమంలో.. అసాధారణ ప్రతిభ కనబరిచిన 1,446 మంది పోలీసు సిబ్బందికి ఆయన రివార్డులు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా నగర పోలీసు చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘ఎక్స్ట్రా మైల్’ పురస్కారాలతో పాటు ‘గుడ్ వర్క్ డన్’ రివార్డులను ఉన్నతాధికారులతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ చేసిన ప్రసంగం సిబ్బందిలో నూతనోత్తేజాన్ని నింపింది. పోలీసు వృత్తి అనేది కేవలం విధి నిర్వహణ మాత్రమే కాదని.. అదొక గొప్ప సామాజిక బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. కేవలం అప్పగించిన పనిని పూర్తి చేయడం కంటే.. ఆపదలో ఉన్న బాధితులకు ఎంతటి భరోసాను కల్పించామన్నదే అసలైన విజయమని స్పష్టం చేశారు. ప్రతి పోలీసు అధికారి తన పనిలో సృజనాత్మకతను, మానవీయతను జోడించాలని, సమాజం పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించినప్పుడే వ్యవస్థపై ప్రజల్లో గౌరవం పెరుగుతుందని ఆయన దిశానిర్దేశం చేశారు.
సిబ్బందిలో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను, వినూత్న ఆలోచనలను గుర్తించేందుకే ‘ఎక్స్ట్రా మైల్’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కమిషనర్ తెలిపారు. విధులకు అతీతంగా.. సమాజ శ్రేయస్సు కోసం అదనపు బాధ్యతతో పనిచేసే ప్రతి అధికారిని ఈ వేదిక గౌరవిస్తుందని చెప్పారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినప్పటికీ.. క్షేత్రస్థాయిలో సిబ్బంది ప్రదర్శించే చిత్తశుద్ధికి, మానవత్వానికి ఏ టెక్నాలజీ సాటిరాదని ఆయన గుర్తు చేశారు. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు అందరూ ఒకే బృందంగా పనిచేయడం వల్లే నగరంలో శాంతిభద్రతలు సజావుగా సాగుతున్నాయని కొనియాడారు.
పురస్కారాల వివరాల్లోకి వెళ్తే.. గత ఆర్థిక సంవత్సరం 2, 3, 4వ త్రైమాసికాల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా గ్రహీతలను ఎంపిక చేశారు. విధులకు మించి సమాజానికి విశేష సేవలందించిన 271 మందికి ఎక్స్ట్రా మైల్ పురస్కారం అందించారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 1,175 మందికి గుడ్ వర్క్ డన్ రివార్డులు అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు మినిస్టీరియల్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా ఉన్నారు.
ఈ పురస్కారాల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని.. ఇకపై ప్రతి నెల జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లకు రివార్డులు అందజేస్తామని సీపీ ప్రకటించారు. కష్టపడి పనిచేసే ప్రతి అధికారికి తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం కేవలం రివార్డుల ప్రదానోత్సవంగానే కాకుండా, తోటి సిబ్బందిలో నిబద్ధతను పెంచే ఒక గొప్ప ప్రేరణాత్మక వేదికగా నిలిచింది.
Also Read: పొలాల్లో బోల్తా పడ్డ శిక్షణ విమానం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన 1,446 మందిని ‘ఎక్స్ట్రా మైల్’ పురస్కారాలతో గౌరవించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్
Hyderabad CP Sajjanar honored 1,446 personnel with the ‘Extra Mile’ awards for their outstanding performance in the line of duty. pic.twitter.com/nMoK2zd7Cs
— BIG TV Breaking News (@bigtvtelugu) February 8, 2026