నేరము.. శిక్ష..?
ఉలిక్కిపడుతున్న కేటీఆర్!
⦿ ఇంట్రెస్టింగ్గా ఫార్ములా ఈ – రేస్ కేసు
⦿ ఏసీబీ దర్యాప్తుతో ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు
⦿ కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్కు లేఖ వెళ్లినట్టు ప్రచారం
⦿ సడెన్గా మీడియా ముందుకొచ్చి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
⦿ ఈ – రేస్ మంచిదే అయితే అడ్డగోలు నిర్ణయాలు ఎందుకు?
⦿ మొదటి పోటీకి రూ.700 కోట్ల లబ్ధి పొందితే.. రెండో సారి స్పాన్సర్స్ ఎందుకు దొరకలేదు?
⦿ డిమాండ్ ఉంటే వరుసగా నాలుగు సార్లు హైదరాబాద్కే ఎందుకొస్తారు?
⦿ డబ్బు వెనక్కి రాదని తెలిసినా రూ.46 కోట్ల ఒత్తిడి దేనికి?
⦿ ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండానే కరెన్సీ మార్పిడి
⦿ మనీ చెల్లించిన 20 రోజులకు అగ్రిమెంట్స్ చేసుకోవడమేంటి?
⦿ అది కూడా ఎన్నికల కోడ్లో ఎలా ఇస్తారు? అంత ఉత్సాహం దేనికి?
⦿ ఆర్థిక శాఖకు లేని ఆతృత నోడల్ ఎజెన్సీ హెచ్ఎండీఏకు ఎందుకు?
⦿ పదవ సెషన్ ఒప్పుకుని ఉంటే రూ.200 కోట్ల నష్టం
⦿ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆగమాగం?
⦿ ఈ ఉల్కిక్కిపాటుతో పుట్టుకొస్తున్న మరిన్ని అనుమానాలు
⦿ కక్షపూరితం ఏముంది? చేసిన తప్పులకు శిక్ష తప్పదంటున్న కాంగ్రెస్
⦿ ఈ – రేసింగ్ అసలు కహానీ.. స్వేచ్ఛ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: Formula E Race: ఫార్ములా ఈ – రేస్ కేసు ఏసీబీ దర్యాప్తుతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేసు నమోదుకు గవర్నర్కి లేఖ వెళ్లిందన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ మీడియా ముందుకొచ్చి నానా మాటలు అనేశారు. ‘‘ఏసీబీ ఉచ్చా, బొచ్చా, జైలుకు పోతే పోతా, యోగా చేసి స్లిమ్ అవుతా, తర్వాత పాదయాత్ర చేస్తా’’ అంటూ కేటీఆర్ కేటీఆర్ చేసిన కామెంట్స్ తర్వాత, ఇందులో ఆయన పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. గొప్పలు చెప్పి, చిప్పకూడు తినేందుకు సిద్ధంగా ఉన్నానంటే, ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రజలు ఆతృతగా ఉన్నారు.
11 నెలలుగా ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్ననేతలకు ఏసీబీ ఎంట్రీతో కొత్త కథలు అల్లుతున్నారు. తన సొంత పత్రిక గుమస్తా తెలంగాణలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు రేసింగ్ సూపర్ బంపర్ అంటూ వార్తలు వండి వడ్డిస్తున్నారు. చేసిన తప్పులను తప్పించుకునేందుకు, మసిపూసి మారేడు కాయ చేసేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. నాటు బాంబు కాదు ఆటం బాంబు అంటూ మంత్రి పొంగులేటి తాజాగా ప్రకటించడంతో ఈ – కార్ రేసింగ్ వ్యవహారం వేడెక్కింది.
అసలు ఏం జరిగింది?
2014లో బీజింగ్లో ఫార్ములా ఈ – రేస్ ప్రారంభమైయింది. చివరి సారిగా దక్షిణ కొరియా సియోల్లో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్. రూ.200 కోట్ల ఖర్చుతో గత ఏడాది ఫిబ్రవరి 11న నిర్వహించారు. స్పాన్సర్గా గ్రీన్ కో సిస్టర్ సంస్థ రూ.150 కోట్లు ఖర్చు చేయగా, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30 కోట్లు, మిగితా రూ.20 కోట్లు నోడల్ ఏజెన్సీ అయిన హెచ్ఎండీఏ నిర్వహణ కోసం ఖర్చు చేశాయి. ఈ రేసింగ్తో రూ.700 కోట్ల లబ్ధి జరిగిందని చెప్పుకుంటున్నారు. కానీ, ప్రమోటర్స్ తీవ్ర నష్టపోయినందున కనీసం స్పాన్సర్గా ఎవరూ ముందుకు రాలేదు.
ఎఫ్ఈవో కూడా తీవ్రంగా నష్టాలను చవిచూసింది. అందుకు పర్సనల్గా తీసుకున్న అనాటి మంత్రి కేటీఆర్ విచ్చలవిడి నిర్ణయాలు తీసుకున్నారు. 9, 10, 11, 12 మొత్తం నాలుగు సెషన్స్ హైదరాబాద్లోనే జరపాలని ఒప్పందం చేసుకున్నారు. దీని వెనుక హంగు ఆర్భాటాలే కారణం. నోడల్ ఏజెన్సీనే స్పాన్సర్గా ఎన్నికల కోడ్ ఉండగా కేటీఆర్ ప్రకటించారు. ఇదే విషయాన్ని అనాటి ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ నోట్ ఫైల్లో పొందుపర్చారు.
సీఎస్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కేవలం ఫోన్ కాల్తోనే రూ.55 కోట్ల ప్రజల సొమ్మును ఎఫ్ఈవోకి చెల్లించారు. అక్టోబర్ 5న రూ.23 కోట్లు, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అక్టోబర్ 11న మంత్రి చెప్పారని ఇంకో రూ.23 కోట్లు ఇచ్చారు. ఇవి వెనక్కి తిరిగి ఇవ్వమని ఆ సంస్థ అప్పుడే చెప్పింది. ఎలాంటి ఒప్పందాలు లేకుండా సొమ్ము ఇవ్వడం, అది కూడా ఆర్బీఐ అనుమతి లేకుండానే రూ.9 కోట్ల ట్యాక్స్తో చెల్లించడం చట్టవిరుద్ధం. ఇవ్వన్నీ చేసిన తర్వాత హెచ్ఎండీఏ అక్టోబర్ 30న అగ్రిమెంట్ చేసుకోవడం ఇంకా పెద్ద తప్పుగా ఏసీబీ భావిస్తోంది. ఎవరో నష్ట పోయారని అందుకు తెలంగాణ సంపదను దోచి పెట్టడం ఏంటని, అందుకే 10వ సెషన్ను ప్రభుత్వం రద్దు చేసినట్టు చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.
రూ.700 కోట్ల లబ్ధి దేవుడెరుగు.. రూ.200 కోట్ల నష్టానికి బ్రేక్
మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో ఫార్ములా ఈ – కార్ రేస్ సెషన్ 10 రద్దయింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 10న జరగాల్సిన రేస్ జరగకపోడంతో హెచ్ఎండీఏ సుమారు రూ.200 కోట్ల నష్టాల బారి నుంచి తప్పించినట్లు అయిందని తెలుస్తోంది.
కేసు నమోదు.. నోటీసుల జారీ
ఏసీబీ కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. సీఎస్ అరవింద్ కుమార్పై విచారణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్యే కేటీఆర్ని విచారించేందుకు గవర్నర్కి లేఖ రాసినట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగా ఆయన ఉలిక్కి పడ్డారు. ఇష్టానుసారంగా మాట్లాడారు. అయితే, ఇలా చేయడం వల్ల కేసులో ఇరుక్కునే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని, తప్పును కప్పిపుచ్చుకునేందుకు రాజకీయాలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
ఏక్ నిరంజన్ల పాలన
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్ రేసింగ్ ఒక్కటే కాదు, చాలానే జరిగాయి. గొప్పల కోసం అన్నిశాఖలు మావే అంటూ ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా కేటీఆర్ ఫోన్లో అదేశించడం, అరవింద్ కుమార్, అమోయ్ కుమార్, సోమేష్ కుమార్లు ఫాలో కావడం జరిగిపోయింది. ఇలా అనేక శాఖల్లో చాలా వ్యవహారాలు నడిపారని, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ – కార్ రేస్ ఎన్నికల కోడ్ ఉండగా చేయడం, అర్ధిక శాఖ, అర్బీఐ అనుమతి లేకపోవడం, చెల్లింపుల తర్వాత ఒప్పందం చేసుకోవడం వంటివి లీగల్గా ఇరికించాయి. దీంతో ఈ కేసు విచారణ మొదట టేక్ ఓవర్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.