Hydraa: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అసలు అలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహారించాలని, ఇందులో భాగంగా ఫైర్ సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీ పడేదే లేదని హాస్టళ్ల నిర్వాహకులకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తేల్చి చెప్పారు. వచ్చేది వేసవి కాలమని, ఎక్కడ ఏమాత్రం పొరపాటు జరిగినా పెనుముప్పు సంభవిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల నగరంలో జరిగిన అగ్ని ప్రమాదాలే ఇందుకు నిదర్శనమన్నారు. నగరంలో లెక్కకు మించి ఉన్న హాస్టళ్లు చాలావరకు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదుల నేపథ్యంలో అగ్ని ప్రమాదాలపై హైడ్రా ఓ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది. హాస్టళ్ల నిర్వాహకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫైర్ సేఫ్టీ విషయంలో పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా అనేకమంది నగరానికి వచ్చి జీవనోపాధి పొందుతున్నారని, నగరంలోని పలు హాస్టళ్లలో నివాసముంటున్నారని, మీరు నిర్వహిస్తున్న హాస్టల్ వారికి ఓ వరం కావాలే తప్పా, వారి ప్రాణాల పాలిట ముప్పుు కావద్దని, వారి బంగారు భవిష్యత్తుకు హాస్టళ్లు ఒక మెట్టుగా ఉండాలన్న విషయాన్ని గుర్తించి వారి భద్రత విషయంలో రాజీ పడొద్దని హైడ్రా కమిషనర్ సూచించారు.
హాస్టళ్ల నిర్వాహకులతో సమావేశానికి ముందు క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకుందామని హైడ్రా అధికారులతో కలిసి కమిషనర్ రంగనాధ్ సంజీవరెడ్డినగర్ ప్రాంతాల్లోని మూడు హాస్టళ్లను ర్యాండమ్గా చెక్ చేశారు. అక్కడి పరిస్థితులు చాలా ఆందోళన కలిగించాయన్నారు. చిన్న గదుల్లో స్థాయికి మించి కిక్కిరిసిన బెడ్లు, ఎక్కడా ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు కనిపించలేదన్నారు. సెల్లార్లలో మెస్లు, భద్రత కోసం వేసిన గ్రిల్స్కు తాళాలు, ఎక్కడా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కనిపించ లేదన్నారు. నాలుగైదు అంతస్తులున్న హాస్టల్ భవనంలో పొరపాటున నిప్పు రగిలితే ఆ ప్రమాదాన్ని ఊహించలేమని, ఇలాంటి పరిస్థితులకు చెక్ పెడదామని ఆయన సూచించారు. స్వయంగా చూసిన పరిస్థితులను వివరించి హాస్టల్ నిర్వాహకులను హెచ్చరించారు. ప్రతి గదిలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పెట్టుకోవాలని, స్మోక్ డిటెక్టర్లు బిగించాలని, ఒక వేళ ప్రమాదం జరిగితే వెంటనే సురక్షితంగా బయట పడేందుకు సరైన మార్గం ఉండేలా చూసుకోవాలని కమిషనర్ రంగనాధ్ సూచించారు. రెండో స్టెయిర్కేస్(మెట్ల మార్గం)కు అవకాశం ఉంటే పెట్టాలని, లేదంటే ల్యాడార్లతో కిందుకు దిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కరెంటు వినియోగం పట్ల జాగ్రత్తలు అవసరమని, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు వాడడంపై అవగాహన పెంచుకోవాలని, ఇవన్నీ చిన్నపాటి జాగ్రత్తలేనని, ఖర్చు కూడా తక్కువేనని, ఇవే పెను ప్రమాదాలను నివారిస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాధ్ వివరించారు.
Also Read: Buddhist Monks: నేడు హైదరాబాద్కు 3వ దమ్మ యాత్ర.. స్వాగతం పలకనున్న మంత్రి జూపల్లి!
అగ్ని ప్రమాదాలపై హైడ్రా చేసిన సూచనలు, జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటిస్తామని హాస్టళ్ల నిర్వాహకులు ఈ సందర్భంగా హైడ్రా కు హామీ ఇచ్చారు. చదువులు, ఉద్యోగ, ఉపాధి కోసం వచ్చిన వారికి ఫుడ్, బెడ్ ఇచ్చి తాము జీవనోపాధి పొందుతున్నామని, వారి భద్రతకు ప్రాధాన్యమిస్తామని నిర్వాహకులు వ్యాఖ్యానించినట్లు సమాచారం. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణతో పాటు పర్యావరణ హితమైన నగర నిర్మాణంలో హైడ్రా కృషి అభినందనీయమని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడంలో ప్రభుత్వ కృషిలో తాము కూడా భాగస్వాములవుతామని సైబరాబాద్ హాస్టళ్ల యజమానుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు అమర్నాథ్ రెడ్డి, కరుణాకర్ తో పాటు హాస్టళ్ల నిర్వాహకులు తెలిపారు. హాస్టళ్లలో నివాసం ఉంటున్న వారి భద్రత ప్రాధాన బాధ్యతగా భావిస్తామన్నారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, ఆర్ ఎఫ్వో జయప్రకాష్, డీఫ్వోలు యజ్ఞ నారాయణ, గౌతమ్, ఏడీఎప్వో మోహనరావుతో ఎస్ ఎఫ్వోలు, జంటనగరాలలోని హాస్టళ్ల నిర్వాహకులు పలువురు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: Mohan Babu :మోహన్ బాబుకు కు హైకోర్టులో చుక్కెదురు.. కిడ్నాప్ కేసులో అరెస్ట్ తప్పదా..?