Hyderabad Corridor: స్వేచ్ఛ బ్యూరో: ఎల్బీనగర్ – హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ తో లక్షల మంది వాహనదారులకు,ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుందని, నిత్యం యాక్సిడెంట్స్ జరుగుతున్న ఈ రహదారిని యాక్సిడెంట్స్ ఫ్రీ మార్గంగా చేయాలని సంకల్పించామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు నిర్మించతలపెట్టిన 7.1 కి.మీ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పురోగతిపై గురువారం రాష్ట్ర సెక్రటేరియట్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నిత్యం యాక్సిడెంట్స్ జరిగే ఈ ప్రాంతంలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని సంకల్పించిందన్నారు.
సుమారు 941 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్ట్ లో రాష్ట్ర వాటాగా 200కోట్లు ఇచ్చేందుకు ఇప్పటికే సీఎం సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. నాగపూర్ తర్వాత ఇండియాలో చేపట్టే రెండో పెద్ద ప్రాజెక్ట్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఎల్బీనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లోని 54 కాలనీల్లో నివసించే సుమారు 20లక్షల మంది ప్రజలకు పెద్ద ఉపశమనం లభిస్తుందని,హైదరాబాద్ – విజయవాడ దారిలో రాకపోకలు సాగించే లక్షల మంది 15నిమిషాల్లోపే సిటీ క్రాస్ చేస్తారని అన్నారు. ఎన్హెచ్- 65 రూట్ లో ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు విపరీతమైన రద్దీ ఏర్పడి,రోడ్ క్రాస్ చేసేటప్పుడు నిత్యం యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే సమీప కాలనీల్లో నివసించే ప్రజలు కింద సర్వీస్ రోడ్డు ద్వారా సులువుగా రోడ్డు దాటవచ్చు అని,ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్పారు.
Also Read: గులాబీ పార్టీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై కన్నేసిన కవిత..!
వీలైనంత త్వరగా సాంక్షన్స్ చేసుకొని,టెండర్ ప్రక్రియ పూర్తి చేసేలా కృషి చేయాలని ఎంఓఆర్టీహెచ్ అధికారులకు సూచించారు. డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు ఎంఓఆర్హెచ్ వార్షిక ప్రణాళికలో ఇప్పటికే పొందుపర్చామని ఆర్ఓ కృష్ణ ప్రసాద్ తెలిపారు. కింద సర్వీస్ రోడ్డు, మధ్యలో జాతీయ రహదారి,పైన మెట్రో రైలు నిర్మాణం నేపథ్యంలో సాంకేతికంగా పిల్లర్ ఫౌండేషన్,స్ట్రక్చర్స్, మెట్రో స్టేషన్స్ వంటి అంశాలపై చర్చించారు. పూర్తి నాణ్యతతో బలమైన పిల్లర్లు, రెగ్యులర్ ఎలివేటెడ్ కారిడార్ కంటే పటిష్టంగా,వెడల్పుగా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్లు నిర్మించాలని చర్చించారు. ఈ నేపథ్యంలో ఒకే వర్క్ ఏజెన్సీ నిర్మాణ పనులు చేపడితే సమన్వయలోపం లాంటి ఇబ్బంది లేకుండా..త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా ఉంటుందనే అభిప్రాయం మంత్రి వ్యక్తం చేశారు.
నిర్మాణ పనులు మానిటరింగ్ చేయడానికి వీలుగా ఉంటుందనీ,పనులు కూడా సమాంతరంగా జరుగుతాయని మంత్రితో అధికారులు తమ అభిప్రాయాలను చెప్పారు. మంత్రి సూచన మేరకు అందుకు అనుగుణంగా హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద్ మోహన్ ప్రాజెక్ట్ కన్సెంట్ ఇచ్చేందుకు అంగీకరించారు. కన్సల్టెన్సీని పిలిచి డీటెయిల్డ్ ఎస్టిమేట్స్ తయారు చేయాలని నిర్ణయించారు. అధికారులు తమ స్థాయిలో ఉన్న పనులు త్వరగా పూర్తి చేస్తే.. వచ్చే వారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పనులు వెంటనే ప్రారంభించేలా విజ్ఞప్తి చేస్తామన్నారు. సమీక్షా సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు,ఆర్ అండ్ బి స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, ఎంఓఆర్టీహెచ్ రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్, హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద మోహన్,ఆర్ అండ్ బి సి.ఈ(ఎన్హెచ్) ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also read: మ్యూల్ ఖాతాలపై సజ్జనార్ సర్జికల్ స్ట్రైక్.. బ్యాంక్ అధికారులకు తప్పని అరెస్టులు!