Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు మరోసారి తన సమర్థతను నిరూపించుకుంది. అత్యవసర వైద్య పరిస్థితిలో ఉన్న ఒక రోగి ప్రాణాలను కాపాడేందుకు ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు , వైద్య బృందం కలసి ఒక గొప్ప ‘ప్రాణదాన మిషన్’ను విజయవంతంగా పూర్తి చేశారు.
ఒక వైపు రహదారులపై ట్రాఫిక్ చిక్కులు ఉన్నప్పటికీ, గుండె, ఊపిరితిత్తులను రాయదుర్గం నుండి రసూల్పురా వరకు సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేకంగా ‘గ్రీన్ ఛానెల్’ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక ఏర్పాటు ద్వారా దాదాపు 14 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే మెట్రో రైలు అధిగమించింది.
గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రి నుండి సేకరించిన ఈ అవయవాలను సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగికి సకాలంలో అందించారు. సాధారణంగా రోడ్డు మార్గంలో గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఈసారి మెట్రో వ్యవస్థను ఉపయోగించి వేగంగా తరలించడం విశేషం. మెట్రో అధికారులు, వైద్య బృందం అందించిన ఈ అద్భుత సమన్వయం వేలాది మంది ప్రయాణికుల మనసులను గెలుచుకోవడమే కాకుండా, మరొకరికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.
Also Read: వచ్చే ఎన్నికల్లో 50శాతానికి పైగా ఓట్లు GEN-Zవే – KTR