Hyderabad Old City Metro : పాత బస్తీకి మెట్రోను పరుగులు పెట్టించాలనే ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాంతంలో గుర్తించిన ప్రభావిత ఆస్తుల యాజమానులకు చెక్కులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో.. ఆ ఆస్తులు ఇకపై.. హైదరాబాద్ మెట్రోకు సొంతం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో భాగ్యనగరంలో మెట్రో మూడో దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణ గుట్ట మార్గంలో భూ సేకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. పాత నగరానికి మెట్రో విస్తరించాలని, అక్కడి చారిత్రక ప్రాంతాలకు పర్యాటకుల రాకపోకలకు వీలుకల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దాంతో పాటే.. ఆ ప్రాంతాన్ని మిగతా నగరంతో అనుసంధానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న 7 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటి వరకు 1,100 లకు పైగా ప్రభావిత ఆస్తులను అధికారులు గుర్తించారు. వీటి స్వాధీనానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆయా యాజమానులతో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ చర్యలు జరిపింది. ఆస్థుల్ని అప్పగించిన వారికి చదరపు గజానికి రూ.81 వేలు ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించగా.. యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే ఆస్థుల్ని స్వాధీనం చేేసేందుకు అనుమతి పత్రాలు సమర్పించిన 169 మందికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం కింద చెక్కుల్ని అందజేయనుంది. సోమవారం నాడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెక్కుల్ని అందజేయనున్నారు.
ఆస్తుల స్వాధీనానికి అనుమతి పత్రాలు సమర్పించి, నష్టపరిహార చెక్కుల్ని అందున్న తర్వాత.. ఆయా స్థలాల్లోని నిర్మాణాల్ని కూల్చే పనుల్ని ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో అథారిటీ ఎండీ రెడ్డి తెలిపారు. చట్టం ప్రకారమే భూసేకరణ చేపడుతున్నట్లు తెలిపిన అధికారులు.. భూసేకరణ చట్టం ప్రకారమే స్థలాల సేకరణ, నష్టపరిహారం చెల్లింపులు చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : చిన్నారి గుండెకు అరుదైన శస్త్ర చికిత్స.. హైదరాబాద్ వైద్యుల ఘనత..
కాగా.. ఈ ప్రాంతంలోని మతపరమైన, సున్నిత ప్రాంతాలకు ఎలాంటి హాని కలగకుండానే మెట్రో నిర్మాణం చేపడతామని ప్రకటించిన NVS రెడ్డి.. మెట్రో రైల్ నిర్మాణంతో ఓల్డ్ సిటీకి కొత్త అందాలు వస్తాయన్నారు. అందంతో పాటు ఉపాధీ అవకాశాలు మెరుగవుతాయని, కాలుష్య రహితంగా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.