హైదరాబాద్లోని మణికొండలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసం వద్ద ఆదివారం భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాండూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘర్షణల నేపథ్యంలో, ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూర్ నుంచి సుమారు 50 మంది పోలీసులు మణికొండలోని ఆయన నివాసానికి చేరుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
కౌంటింగ్ కేంద్రం వద్ద వివాదం
తాండూర్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా వివాదం మొదలైంది. వార్డుల కౌంటింగ్ ఇంకా పూర్తి కాకముందే ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను లోపలికి అనుమతించడంపై రోహిత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నాయకులను కూడా లోపలికి పంపాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో పోలీసులకు, బిఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
సీఐపై దాడి..
కౌంటింగ్ సెంటర్ వద్ద పరిస్థితి అదుపు తప్పుతున్న సమయంలో, విధుల్లో ఉన్న సీఐ సంతోష్ను రోహిత్ రెడ్డి తోసేసినట్లు సమాచారం. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు, విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడి మరియు ఆటంకం కలిగించినందుకు గాను రోహిత్ రెడ్డితో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విషయాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు.
మణికొండ నివాసం వద్ద పోలీసుల హంగామా
కేసు నమోదు చేసిన వెంటనే తాండూర్ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. మణికొండలోని రోహిత్ రెడ్డి నివాసం లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేయగా, ఆయన అనుచరులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు గృహ ఆవరణలోకి వెళ్తుండగా, కుటుంబ సభ్యులు తమ ఫోన్లతో వీడియో తీసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారి ఫోన్లను బలవంతంగా లాక్కున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం రోహిత్ రెడ్డి ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. తాండూర్ రోడ్డుపై కూడా బిఆర్ఎస్ నాయకులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఏ క్షణమైనా మాజీ ఎమ్మెల్యే అరెస్టు అయ్యే అవకాశం ఉండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.