Hyderabad Flats: హైదరాబాద్ లో సొంత ఇళ్లు ఉండాలనేది ఎంతో మంది కల. ఐటీ కారిడార్ లో మధ్య తరగతి, తక్కువ ఆదాయ వర్గాలకు ఇళ్లు కొనలేని పరిస్థితి. ఇక్కడ భూమి ధరలు, ఫ్లాట్ల్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే మధ్య తరగతి వాళ్లను కలను సాకారం చేసేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ఆదాయ వర్గాలకు గచ్చిబౌలి, వరంగల్, ఖమ్మం నగరాల్లో మొత్తం 339 ఫ్లాట్లను అమ్మకానికి అందుబాటులోకి తెచ్చింది.
గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో కేవలం రూ.26.4 లక్షల ప్రారంభ ధరకు ఫ్లాట్ అందుబాటులోకి తెచ్చింది. ఐటీ కంపెనీలు, కార్పొరేట్ ఆఫీసులు, మెట్రో కనెక్టివిటీ, కీలక రోడ్లు దగ్గరగా ఉన్న గచ్చిబౌలి ప్రాంతంలో.. ఈ ధరకు ఇల్లు దొరకడం చాలా కష్టం. అయితే మధ్య తరగతి ప్రజలు కలను సాకారం చేసేందుకు అరుదైన అవకాశం లభించింది.
గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి సమీపంలో రామ్కీ టవర్స్, రామ్కీ సీఈవో క్వార్టర్స్, వసంత ప్రాజెక్ట్స్ పరిసరాల్లో ఉన్న ఫ్లాట్లను తక్కువ ఆదాయ వర్గాలకు తెలంగాణ హౌసింగ్ బోర్డు విక్రయానికి అందుబాటులో ఉంచింది. ఈ ప్రాంతంలో మొత్తం 111 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 479 నుంచి 636 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.26.40 లక్షల నుంచి రూ.36.20 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. ఐటీ కారిడార్, ఆసుపత్రులు, కాలేజీలు ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ లో ఇంత తక్కువ ధరకు ఫ్లాట్లు దొరకడం చాలా అరుదు అని వ్యాపారులు అంటున్నారు.
ఈ అవకాశం కేవలం నెలకు రూ.50 వేల లోపు ఆదాయం ఉన్నవారికి మాత్రమే. లాటరీ నిర్వహించి ఫ్లాట్ కేటాయిస్తదాయి. ఫ్లాట్ వచ్చిన వెంటనే ఆదాయ ధృవీకరణ పత్రం చూపించాలి. పారదర్శకత కోసమే లాటరీ నిర్వహిస్తు్న్నామని తెలంగాణ హౌసింగ్ బోర్డు చెబుతోంది. ఈ ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే రూ.1 లక్ష టోకెన్ అడ్వాన్స్ చెల్లించి.. మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 3, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. గచ్చిబౌలిలోని ఫ్లాట్లకు జనవరి 6న నిర్మిత్ కేంద్రంలో లాటరీ డ్రా తీస్తారు.
వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కూడా ఈ తరహా ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ హౌసింగ్ బోర్డు తెలిపింది. వరంగల్లో రైల్వే స్టేషన్కు సమీపంలోని కాలనీలో 102 ఫ్లాట్లు, ఖమ్మంలో శ్రీరామ్ హిల్స్, బోనకల్ రోడ్ ప్రాంతంలో 126 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని హౌసింగ్ బోర్డు తెలిపింది. వరంగల్, ఖమ్మంలోని ఫ్లాట్లను మరింత తక్కువ ధరకు విక్రయించనున్నారు. వీటికి జనవరి 8న వరంగల్, జనవరి 10న ఖమ్మం ఫ్లాట్లకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు.
Also Read: Komatireddy Venkat Reddy: కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు: కోమటిరెడ్డి
లక్కీ డ్రాలో ఫ్లాట్ రాని వారికి టోకెన్ అడ్వాన్స్ రూ.1 లక్ష తిరిగి చెలిస్తామని హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది. లాటరీలో ఫ్లాట్ వస్తే అభ్యర్థులు నిర్ణీత గడువుల్లో విడతల వారీగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాట్ కేటాయింపు సమాచారం అందిన తేదీ నుంచి 15 రోజుల్లోపు మొత్తం ఫ్లాట్ ధరలో 25 శాతం చెల్లించాలని అధికారులు తెలిపారు. 60 రోజుల్లో ఫ్లాట్ ధరలో మరో 50 శాతం, మిగిలిన 25 శాతం మొత్తాన్ని 90 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. మూడు విడతల్లో మొత్తం చెల్లింపులు పూర్తి చేసిన తరువాత ఫ్లాట్ మీ పేరుపై రిజిస్టర్ చేస్తారు.