Indian student: అమెరికాలో నదులు, సరస్సులు భారతీయ యువకుల పాలిట మృత్యు మార్గాలుగా మారుతున్నాయా? ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ యువకులు ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన మరొక యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమెరికాలోని లూసియానా ప్రాంతంలో తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలోని లూసియానాలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. స్నేహితులను కాపాడే ప్రయత్నంలో తెలుగు వ్యక్తి అనురూప్ రెడ్డి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. టొరోడో పార్క్లో సెబాన్ రివర్లో ఫ్రెండ్స్తో స్విమ్ చేసేందుకు ఫ్రెండ్స్ కలిసి అక్కడికి వెళ్లాడు అనురూప్ రెడ్డి. ఈత కొట్టే సమయంలో ముగ్గురు స్నేహితులు లోతు ప్రదేశంలోకి వెళ్లిపోయారు.
తమను రక్షించాలంటూ కేకలు వేయడంతో అనురూప్ రెడ్డి ఒక్కొక్కరిని పైకి లాగుతూ కాపాడే ప్రయత్నం చేశాడు. చివరగా అనురూపురెడ్డి పైకి వచ్చే క్రమంలో కాలికి తీగ చుట్టుకుంది. దీంతో అతడు పైకి రావడం మరింత కష్టంగా మారింది. అదే సమయంలో ఆ నదిలో నీటి ప్రవాహం అమాంతంగా పెరిగింది. ఒడ్డున ఉండే ఫ్రెండ్స్, ఈతగాళ్లు అనురూప్ని రక్షించే ప్రయత్నం చేశారు.
ఫ్రెండ్స్ని కాపాడే ప్రయత్నంలో, తెలుగు విద్యార్థి అనురూప్రెడ్డి మృతి
అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎట్టకేలకు అనురూప్ని నది నుంచి బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. టీం ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ-ఇండియన్ ఎంబసీ-లూసియానా కాన్సులేట్ సహకారంతో మరో వారం రోజుల్లో అతడి పార్థివ దేహాన్ని ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతం అబ్దుల్లాపూర్మెట్ మండలం కావడిపల్లి గ్రామానికి చెందిన రాజేందర్రెడ్డి- దుర్గ భవాని దంపతుల రెండో సంతానం అనురూప్రెడ్డి. మొదటి కొడుకు ఆశ్రీత్ రెడ్డితోపాటు అనురూప్ ఐదేళ్ల కిందట అమెరికాకు వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వచ్చే నెల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాలని భావిస్తున్నాడు.
ALSO READ: కుర్ర ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు వార్నింగ్..!
ఇలాంటి సమయంలో తమ కొడుకు ఈ లోకాన్ని విడిచిపెడతామని తాము అనుకోలేదని అతడి కుటుంబం చెబుతున్నారు. అనురూప్ లేదన్న వార్త తెలియగానే సన్నిహితులు దుఃఖంలో మునిగిపోయారు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే అనురూప్రెడ్డికి ఫోటోగ్రఫీ ఎంతో ఇష్టం. స్నేహితుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడం ప్రతి ఒక్కరినీ కలచి వేసింది.