జో జీతా వహీ సికందర్.. గెలిచిన వాడే చక్రవర్తి అన్నట్లు.. స్థానిక పోరులో గెలుపే అంతిమ లక్ష్యం కావాలని వైఎస్ జగన్.. పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రతి స్థానంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని.. ఏకగ్రీవాలకు ఆస్కారం ఇవ్వొద్దన్నారు. గెలుపు కోసం వ్యక్తిగత ఈగోలను పక్కనపెట్టి, అభ్యర్థి వ్యక్తిగత బలానికే ప్రాధాన్యం ఇవ్వాలనడం ద్వారా సత్తా చాటే ప్రయత్నాలను సీరియస్ గా తీసుకుంటున్నారు.
కార్యకర్తలపై అధికార దుర్వినియోగం జరిగితే లీగల్ సెల్స్ అండగా నిలవాలని, అవసరమైతే కేసులను హైకోర్టు వరకు తీసుకెళ్లాలని చెప్పడం ద్వారా మీ వెనుక మేముంటామని మెసేజ్ ఇచ్చారు. మరోవైపు గ్రామస్థాయి కమిటీల నుంచి సోషల్ మీడియా వరకు పార్టీ యంత్రాంగాన్ని యాక్టివేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కేడర్ కోసం భారీ సంఖ్యలో ఐడీ కార్డుల పంపిణీ, గ్రామస్థాయి సమావేశాలకు కార్యాచరణ ప్రకటించారు. అసలు ప్రశ్న ఏంటంటే.. స్థానిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే కారణంతోనే ఇంతటి భారీ కసరత్తా? లేక వైసీపీ పునర్నిర్మాణానికి స్థానిక పోరును జగన్ తొలి పరీక్షగా భావిస్తున్నారా? చూడాలి.