Hyderabad: విద్యార్థుల ఫీజలు బకాయి కోసం 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు. దీక్షలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో మంగళవారం సాయంత్రం ఆయన దీక్ష విరమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఆయనకు ఏం జరిగింది?
తెలంగాణలో 40 లక్షల మంది విద్యార్థుల బకాయిలను పెండింగ్లో పెట్టిన ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ నిరాహార దీక్షకు దిగింది. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నిరాహార దీక్షకు దిగారు. దీక్షలో ఆయన ఏమీ ముట్టుకోకపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం రామచందర్రావును పరీక్షించిన వైద్యులు.. బీపీ క్రమంగా తగ్గుతోందని తెలిపారు.
ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశముందని వివరించారు. డాక్టర్ల సూచనతో మంగళవారం మధ్యాహ్నాం ఆయన దీక్ష విరమించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ఫీజు బకాయి-భాజపా లడాయి’ పేరుతో సోమవారం చీఫ్ రాంచందర్ రావు దీక్షకు దిగిన విషయం తెల్సిందే.
ఆయన దీక్షకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజిగిరి ఎంపీ ఈటల, ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించే వరకు మా పోరాటం ఆగదని, భవిష్యత్తులో ఈ ఆందోళనలను తీవ్రతరం చేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ చీఫ్ రాంచందర్ రావు, ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు స్పష్టమైన ప్రోటోకాల్స్ ఉంటాయన్నారు. గతంలో అమెరికా, లండన్ వెళ్లినప్పుడు అడ్డుకోని కేంద్రం, ఇప్పుడు ఎందుకు అడ్డుకుందో ఆలోచించాలన్నారు. గతంలో చంద్రబాబు, కేసీఆర్, స్టాలిన్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు విదేశీ పర్యటనను కేంద్రప్రభుత్వాలు అనుమతులు నిరాకరించాయని గుర్తు చేశారు.
ALSO READ: కొండా సురేఖ ఎపిసోడ్తో వేడెక్కిన రాజకీయాలు.. రేవంత్ కేబినెట్ పునర్ వ్యస్థీకరణ, ముగ్గురిపై వేటు?
దీక్షలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడారు. ఫీజులు కట్టలేదని విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడం దుర్మార్గమని అన్నారు. ఒకప్పుడు అన్ని వసతులతో కళకళలాడిన ప్రభుత్వ బడులు, ఇప్పుడు దయనీయంగా మారాయన్నారు. కనీసం అటెండర్లు లేక వేలాది బడులు మూతపడ్డాయని ఆరోపించారు. ఆక్స్ ఫర్డ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కంటే ప్రభుత్వ బడుల్లో వాస్తవాలు చూడాలన్నారు.