Kishan Reddy: అమెరికా పర్యటనను ఉద్ధేశపూర్వకంగా కేంద్రం అడ్డుకుందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. అనుమతులు లేకుండా ఎందుకు విదేశీ పర్యటనకు వెళ్లారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి స్థాయికి తగినట్లుగా ఈ పర్యటన లేదన్న కిషన్ రెడ్డి.. నిబంధనలకు అనుగుణంగా ఆయన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదన్నారు. ఇవేవో కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు కావని.. స్వాతంత్రం నుంచి ఉన్న నిబంధనలే అమలు చేశామని స్పష్టం చేశారు.
భారత్ పై విషం చిమ్మే న్యూయార్క్ మేయర్ మామ్దాని (Zohran Mamdani)నీ రేవంత్ కలవబోతున్నట్లు వార్తలు వచ్చాయని కిషన్ రెడ్డి అన్నారు. భారత ప్రధాని మోదీని టెర్రరిస్టు మామ్దాని అవమానించారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కలవాలని భావించారో సమాధానం చెప్పాలని నిలదీశారు. మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గుజరాత్ కు ఇచ్చి.. తమకు అనుమతి ఇవ్వలేదని రేవంత్ వాదించడం వితండవాదని మండిపడ్డారు.
Also Read: మంత్రి అనుకొని.. సామాన్య యువతిపై ట్రోల్స్.. ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన బాధితురాలు!
గతంలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నాటి కాంగ్రెస్ అమెరికా పర్యటనకు నిరాకరించిన విషయాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. అయితే రేవంత్ విషయంలో కేంద్రం ఎప్పుడూ పక్షపాత ధోరణితో లేదన్నారు. హార్వర్డ్ బిజినెస్ కోర్స్ చదివేందుకు ఆయనకు అనుమతించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అమెరికా పర్యటన షెడ్యూల్ పై సీఎం రేవంత్ ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలని కోరారు. మరోవైపు కులగణన అంశంలో తెలంగాణ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. హైదరాబాద్ లో 20 శాతం ఇళ్లల్లో కూడా కులగణన జరగలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.
Also Read: విజయ సాయిరెడ్డి ఎవరు విడిచిన బాణం.. ఎవరి పై గురి? బాబుకు కలిసొస్తున్న మిత్రబేధం?