Spoiled Chicken: సామాన్యుల ఆరోగ్యం కంటే లాభాలే పరమావధిగా భావించే కొందరు కేటుగాళ్లు, వంటింట్లో వాడే నిత్యావసరాల నుండి పిల్లలు ఇష్టంగా తినే తినుబండారాల వరకు వేటినీ వదలడం లేదు. ఇటీవల నిత్యం మనం వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నారులు అమితంగా ఇష్టపడే కేకులు, డోనట్లలో విషతుల్యమైన రసాయనాలు కలిపిన ఘటనలు చూశాం. అయితే ఈ కల్తీ కేవలం రసాయనాలకే పరిమితం కాకుండా, అత్యంత ప్రమాదకరమైన జంతు మాంసం విక్రయాల వరకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (H-FAST) బృందం ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నిల్వ ఉంచిన కుళ్ళిన చికెన్ను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కె. నాగార్జునతో కలిసి మూసాపేట సమీపంలోని భరత్ నగర్ వద్ద ఉన్న ‘మెసర్స్ ఎస్.పి.ఆర్ (SPR) చికెన్’ ప్రాంగణంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 352 కిలోల గడ్డకట్టిన కుళ్ళిన చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితుడు సూరజ్ పాల్ (66), అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఈ మాంసాన్ని నిల్వ ఉంచి స్థానిక హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారణ అయింది.
పోలీసుల పరిశీలనలో సదరు సంస్థకు సంబంధించిన FSSAI లైసెన్స్ గడువు ముగిసినట్లు వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న మాంసంలో రెక్కలు, రొమ్ము భాగం, కాలేయం వంటి భాగాలు పూర్తిగా కుళ్ళిపోయి, మానవ వినియోగానికి ఏమాత్రం యోగ్యంగా లేవని అధికారులు ధృవీకరించారు. ఆహార పదార్థాల్లో కలిపే విషతుల్యమైన రసాయనాలు, ఇటువంటి కుళ్ళిన మాంసం వల్ల క్యాన్సర్, కాలేయ వ్యాధులు, తీవ్రమైన ఆహార విషతుల్యత (Food Poisoning) వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇటువంటి వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ హెచ్చరించారు.
ఆహార కల్తీని అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు కేవలం అధీకృత, పరిశుభ్రమైన కేంద్రాల నుంచే తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార తయారీ లేదా నిల్వ చేస్తున్నట్లు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సనత్ నగర్ పోలీసులు ఈ కేసును నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
Read Also: Anantapur Crime News: భర్తను కిరాతకంగా చంపి.. ఇంటి ముందే పాతిపెట్టిన భార్య!