Wrong Side Driving: స్వేఛ్చ బ్యూరో: ఎన్నిరకాలుగా చెప్పినా.. జరిమానాలు విధిస్తున్నా ట్రాఫిక్ నిబంధనల ఉల్లం‘ఘనుల్లో’ మార్పు మాత్రం రావటం లేదు. రోడ్డు భద్రతకు పూర్తిగా నీళ్లొదులుతూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండటంతోపాటు ఇతరుల జీవితాలతో చెలగాటాలాడుతున్నారు. ఇలాంటి వారికి బ్రేకులు వేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అంశాల వారీగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రతీ శని, ఆదివారాల్లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు జరుపుతున్న సిబ్బంది తాజాగా వారం రోజులపాటు రాంగ్ సైడ్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ జరిపారు.
ఈ క్రమంలో రాంగ్ సైడ్ లో వాహనాలు నడుపుతూ 21,713 వేల మంది పట్టుబడగా అందరిపై కేసులు నమోదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం దాదాపు 95లక్షల వాహనాలు రహదారులపై నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ కారణంగానే ముఖ్యంగా పీక్ హవర్స్ లో ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ జాంతో కనిపిస్తుంటుంది. వాహనాల సరాసరి వేగాన్ని గంటకు 20 కిలోమీటర్లకు పెంచటానికి అధికార యంత్రాంగాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా వాహనాలు నడపటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. యాక్సిడెంట్లలో నిండు ప్రాణాలు బలవుతున్నాయి. మరికొందరు గాయాలకు గురై జీవచ్ఛవాల్లా బతుకులు వెళ్లదీస్తున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారు.. గాయాలకు గురై మంచాలకు పరిమితమైన వారి కుటుంబాల ఆవేదన వర్ణనాతీతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే యాక్సిడెంట్లను తగ్గించటానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపవద్దని చెప్పారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ అస్సలే చేయవద్దని తెలిపారు. మద్యం సేవించి వాహనాలతో రోడ్ల పైకి రావద్దన్నారు.
అయినా, చాలామంది వాహనదారుల్లో మార్పు మాత్రం కనిపించటం లేదు. ఈనెల 2వ తేదీ నుంచి వారం రోజులపాటు రాంగ్ సైడ్ డ్రైవింగ్ పై హైదరాబాద్ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ జరుపగా ఏకంగా 21,713మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరందరిపై కేసులు నమోదు చేసినట్టు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ చెప్పారు. అందరిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
రాంగ్ సైడ్ లో వాహనాలు నడపటం అన్నది వాహనదారులకు అలవాటుగా మారిపోయిందని ఆయన చెప్పారు. దీని వల్ల మిగితా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జాంలు జరుగుతున్నాయన్నారు. దాంతోపాటు ప్రమాదాలు జరుగుతున్నట్టు చెప్పారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ తీవ్రమైన ఉల్లంఘన అని తెలిపారు. గత ఏడాది కమిషనరేట్ పరిధిలో 2,679 యాక్సిడెంట్లు జరిగితే 294మంది మృత్యువాత పడ్డారన్నారు. మరో 2,950మంది గాయపడ్డారని తెలిపారు. ఇక, 2025లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ 6.07లక్షల మంది పట్టుబడటం పరిస్థితికి దర్పణం పడుతోందని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు కంట పడినట్టయితే పౌరులు పోలీసు శాఖ అధికారిక సోషల్ మీడియా ఖాతాలైన Facebook, X (Twitter), ట్రాఫిక్ హెల్ప్లైన్ 9010203626, ఈ-చలాన్ హెల్ప్డెస్క్ 8712661690 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Also Read: Social drama OTT : స్కూల్ పై పొలిటికల్ లీడర్ కన్ను… మాస్టారు ఇచ్చే ఝలక్ కు బుర్రబద్దలు