Hyderabad Flyover: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సర్కారు హెచ్ సిటీ కింద నిర్మిస్తున్న ఒక్కో ప్రాజెక్టు క్రమంగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం వాహనదారులు వినియోగిస్తున్న ఇందిరాపార్కు టూ ఆర్టీసీ క్రాస్ రోడ్డు స్టీల్ బ్రిడ్జికి తోడు సైదాబాద్ లో మరో స్టీల్ ఫ్లై ఓవర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రాంతాల వారీగా వాహనదారులకు ట్రాఫిక్ సమస్య నుంచి కొంత ఉపశమనం కల్గుతుంది. నిత్యం రద్దీగా ఉండే నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి కంచన్ బాగ్ ఓవైసీ హాస్పిటల్ వరకు దశాబ్దాల క్రితం ప్రతిపాదించిన స్టీల్ బ్రిడ్జి పనులు ముగిసి, బ్రిడ్జి ప్రారంభానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.
సుమారు రూ. 620 కోట్ల వ్యయంతో మొత్తం 3.32 కిలోమీటర్ల పొడువున ఆరు లేన్లుగా నిర్మించిన ఈ స్టీల్ ఫ్లై ఓవర్ క్షేత్ర స్థాయిలో అనేక రకాల అడ్డంకులను అధిగమించి, ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకుంది. ముఖ్యంగా ఐఎస్ సదన్లో ఉన్న ఓ దేవాలయం, మరో ప్రార్థన మందిరాలకు ఎఫెక్టు చేసేలా ఈ వంతెనను నిర్మిస్తున్నారంటూ స్థానికులు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలను వ్యక్తం చేయటంతో పాటు పలు సార్లు ఆందోళనలు కూడా చేపట్టారు. దీనికి తోడు స్థల సేకరణకు కూడా అనేక రకాల అడ్డంకులు ఏర్పడినా, అధికారులు ఎంతో వ్యూహాత్మకంగా వాటిని అధిగమించి, ఈ వంతెన పనులను ముందుకు తీసుకెళ్లారు.
కొద్ది రోజుల క్రితం కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ రత్నాకర్ ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి, నిర్ణీత గడువులోపే నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వంతెనను వచ్చే 15వ తేదీ రోజున పంద్రాగస్టును పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఓవైసీ హాస్పిటల్ వరకు సుమారు 210 మీటర్ల పొడువున అప్ ర్యాంప్ ను నిర్మించగా, అక్బర్ బాగ్ వద్ద డౌన్ ర్యాంప్ ను కూడా నిర్మించారు.
Also Read: లష్కర్ బోనాల జాతర.. ఉజ్జయిని మహాకాళి సేవలో సీఎం రేవంత్ రెడ్డి!
ఈ స్టీల్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి కంచన్ బాగ్ ఓవైసీ హాస్పిటల్ వరకు ఇక రాకపోకలు వేగంగా ముందుకు కదలనున్నాయి. ప్రస్తుతం చాంద్రాయణగుట్ట, సైదాబాద్, కంచన్ బాగ్ లో నెలకొన్న ట్రాఫిక్ తగ్గుముఖం పట్టి, వాహానాలు వేగంగా ముందుకు సాగేందుకు వీలు కల్గడంతో పాటు సగ్నల్ ఫ్రీ ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓల్ట్ సిటీ, న్యూ సిటీల మధ్యనే గాక, న్యూ సిటీ నుంచి పలు శివారు ప్రాంతాలకు కూడా రాకపోకలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.
మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. పంద్రాగస్టు కల్లా పనులు పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. రూ.52 కోట్లతో మొత్తం ఆరులేన్లతో 220 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఇరువైపులా 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్పాత్లను నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి ముందుగా ఒక పక్కన మూడులేన్లతో అందుబాటులోకి రానుంది. ఆ తరువాత మరో పక్కన పనులు చేయనున్నారు. ఇప్పటికే ఈ బ్రిడ్జిపై 8 నెలలుగా రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి అందుబాటులోకి వస్తే అంబర్పేట్– మలక్పేట్ మధ్య రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి.
Also Read: WhatsApp యూజర్లకు బిగ్ రిలీఫ్.. స్టేటస్ క్యాప్షన్లో తప్పు పడిందా? ఇక డిలీట్ చేయక్కర్లేదు!
భారీ వర్షాలు, వరదలు వచ్చినా ప్రతీ సారి ఇక్కడ ఇబ్బందులు తలెత్తేవి. 2020 లో వరదలు వచ్చిన సమయంలో గత ప్రభుత్వం ఈ నిర్మాణాలకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తిన సమయంలో మాత్రమే దీని ప్రస్తావన వచ్చేది. ఆ తరువాత నిర్మాణం విషయాన్ని ఎవరూ పట్టించుకునే వారే కాదు. 2023 జులైలో జంటజలాశయాల గేట్లు ఎత్తిన సమయంలో మూసారాంబాగ్ బ్రిడ్జి బంద్ చేశారు. మరోసారి ఇబ్బందులు లేకుండా ఈ బ్రిడ్జి నిర్మించనున్నట్లు, అందుకు సంబంధించిన పనులు 10 రోజుల్లో ప్రారంభిస్తామని అప్పట్లో మంత్రులుగా ఉన్నవారు చెప్పినప్పటికీ పనులు మాత్రం అప్పట్లో మొదలు పెట్టలేదు.
బ్రిడ్జి కోసం టెండర్లు గత ప్రభుత్వ హాయంలోనే వేశారు. టెండర్ పూర్తయిన పనులు కూడా కూడా త్వరగా చేయలేకపోయారు. అంతలోనే ఎన్నికలు రావడంతో పనులు ముందుకుసాగలేదు. ఆ తరువాత 2024లో పనులు తిరిగి స్టార్ట్ చేశారు. పాత బ్రిడ్జి కూల్చివేత, తదితర సమస్యల కారణంగా కొంత ఆలస్యం అయ్యింది. ఇప్పుడు పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే వరదలు వచ్చిన సమయంలో వాహనదారులకు ఇబ్బందులుండవు. ప్రధానంగా అంబర్పేట, దిల్సుఖ్నగర్ ప్రాంతాలకు మూసారంబాగ్ మీదుగా ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.
Also Read: కూతుళ్లు చెప్పినా వినకుండా రూ.26 కోట్లు నష్టపోయిన నిర్మాత?