Hyderabad Water Board: జలమండలి బోర్డు పరిధి కోర్ అర్బన్ రీజయన్ వరకు పరిధి పెరగడంతో వాటర్ సప్లై, సీవరేజ్ సేవలు మరింత సమర్ధవంతంగా అందించేందుకు, స్థానికంగా నెలకొన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు జలమండలి శుక్రవారం నుంచి బస్తీ బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు రూపొందించిన ఈ కార్యక్రమంలో జలమండలికి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ మొదలుకుని వార్డు మేనేజర్ల వరకు భాగస్వామ్యులు కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Komatireddy Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డి సమస్యకు చెక్? మంత్రి పదవి పై తేల్చనున్న హై కమాండ్
వారంలో నాలుగు రోజులు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ నేరుగా ప్రజల్లోకి వెళ్లి సమస్యలను నేరుగా తెల్సుకుని పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. జలమండలి పరిధిలోని బస్తీ, కాలనీలలో ప్రతి మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు మేనేజింగ్ డైరెక్టర్ నుంచి వార్డు మేనేజర్ల వరకు పర్యటించనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కార్యాలయంలో యధావిధిగా అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఎండీ నుంచి వార్డు మేనేజర్ల వరకు పర్యటించి, మంచినీరు, సీవరేజీ సమస్యలు గుర్తించి, ప్రజలతో మాట్లాడి, సమస్యలు తెలుసుకుని, తాత్కాలిక పరిష్కార మార్గాలను చూపి, ఆ తర్వాత శాశ్వత పరిష్కారం కోసం వార్డుల వారిగా ప్రణాళికలు రూపొందించుకుంటారని వెల్లడించారు.
బస్తీలో పర్యటన తీరును పరిశీలించేందుకు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్, జాయింట్ ఎండీ, డైరెక్టర్లు, రీజియన్ ఈడీలు, డైరెక్టర్ (ఆపరేషన్)లు, జోన్ సీజీఎం, జనరల్ మేనేర్లు, సర్కిల్ డీజీఎం వరకు వారి పరిధుల్లో అకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు, సమస్యల పరిష్కరానికి ప్రజలతో మమేకం కానున్నట్లు తెలిపారు. సీవరేజీ మ్యాన్ హోల్స్, పైప్లైన్ పరిస్థితి, లీకేజీ, ఓవర్ ఫ్లో, డీసిల్టింగ్ పనులను పరిశీలించనున్నారు. వాటర్ పైప్లైన్, లీకేజీలు, నీటి సరఫరాలో సమయ పాలన, నీటి వృధా, లో-ప్రెషర్, నల్లలకు మోటర్ల బిగింపు, సరఫరా అవుతున్న తాగు నీటి నాణ్యత పరిశీలించి, అవసరమైన చోట సత్వర చర్యలును చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే నివాసాల్లో భూగర్బజలాల పెంపు కోసం ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్వెల్స్పై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.