Hyderabad Water Board: నీటిని వృథా చేయకుండా, పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి సూచించారు. క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా సీవరేజ్ సమస్యలను గుర్తించడానికి జలమండలి చేపట్టిన జలమండలి బస్తీ బాట రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఉప్పాలగూడలోని సెక్రటేరియట్ కాలనీ, శ్రీ నగర్ కాలనీ ప్రాంతంలో అధికారులతో కలిసి ఎండీ పర్యటించారు. నీటి సరఫరా సమయంలో పలు ఇండ్లను సందర్శించిన ఎండీ నీటి సరఫరాలో సమస్యల కోసం ఆరా తీశారు. క్యూ ఏటీ సిబ్బందితో కలిసి క్లోరిన్ స్థాయిలు, నీటి ప్రెషర్, నీటి సరఫరా సమయాలపై సమీక్షించారు. సీవరేజీ నెట్ వర్క్ పై కాలనీ వాసులతో చర్చించారు. కాలనీలలో విస్తృతంగా సందర్శించిన జలమండలి ఎండీ కొంతమంది తాగునీటిని వృధా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ నీటిని వృధా చేయకుంటే, పొదుపు చేసినట్టే అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని కాపాడుకునేందుకు వారి వంతు ప్రయత్నం చేయాలన్నారు. విద్యావంతులు నీటి పొదుపు పట్ల మరింత బాధ్యతగా ఉండాలని, ఇతరులకు అవగాహన కల్పించడంలోను ముందుండాలని కోరారు. జలమండలి సుదీర్ఘ ప్రాంతాలనుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నగరవాసుల నీటి అవసరాలను తీర్చడానికి కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తరలించి, శుద్ధి చేసి నగర ప్రజలకు సరఫరా చేస్తోందని వివరించారు. కావున నీటిని వృథా చేయకూడదని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నీటిని వృధా చేస్తున్న వారిని గుర్తించి, మళ్ళీ పునరావృత్తం అయితే పెనాల్టీ విధించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: High Blood Sugar: బ్లడ్ షుగర్ పెరుగుతోందా? ఈ 3 చిట్కాలు పాటిస్తే చాలు!
నీటిని వృధా చేసే వారిపై ఫిర్యాదు చేయడానికి త్వరలో ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ యాప్ ద్వారా నీటిని వృథా చేస్తున్న వారిపై పౌరులు ఎవరైనా ఫోటో అప్ లోడ్ చేసి, ర్యాదు చేయవచ్చన్నారు. అధికారులు పరిశీలించి దానికి అనుగుణంగా వారికి పెనాల్టీ విధిస్తారని ఎండీ వివరించారు. ఆ ప్రాంతాల్లో భూగర్భజలాల పరిస్థితిని, బోరుబావుల స్థితిగతులను ఎండీ స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్ డిమాండ్, బుకింగ్, డెలివరీ సమయాలపై సమీక్షించారు. అనంతరం ఎండీ ఖాజాగూడ చెరువు దిగువ ప్రాంతం, మణికొండ, చిత్రపురి కాలనీ ప్రాంతాల నుండి ఉత్పత్తి అయ్యే మురుగును శుద్ధి చేయుటకు చిత్రపురి హిల్స్ సమీపంలో 30 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న చిత్రపురి మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు.
Also Read: GHMC: ముగిసిన నోటీసుల జారీ.. ఇక వచ్చేవారం నుంచి ఆస్తులు సీజ్..?