Water Wastage: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ మహనగరవాసుల దాహర్తిని తీర్చేందుకు జలమండలి ఎన్నో ప్రయాసలకోర్చి వందలాది కిలోమీటర్ల నుంచి శుద్ది చేసి నగరానికి తరలిస్తున్న మంచి నీటి వృధా ను అరికట్టేందుకు జలమండలి ఫూర్తి స్థాయిలో సిద్దమైంది. ఇందుకు గాను నీటిని వృధా చేస్తున్న వారిని గుర్తించి, వారికి భారీగా జరిమానాలు విధించాలని భావిస్తుంది. జలమండలి విజిలెన్స్ లో కేవలం ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, ఎనిమిది మంది హోం గార్డులుండటంతో నీటి వృథాను అరికట్టేందుకు ప్రస్తుతమున్న సిబ్బంది చాలకపోవటంతో వినియోగదారులైన నగరవాసుల సేవలను వినియోగించుకోవాలని భావిస్తుంది. సేవ్ వాటర్ వాలంటీర్లుగా నియమించే ప్రక్రియను చేపట్టింది.
నీటి వృథాపై ఇప్పటి వరకు అడపాదడపాగా జరిమానాలు విధిస్తున్నా, నీటిని వృధా చేస్తున్న వారిలో మార్పు రాకపోవటంతో ఇలాంటి వారిని గుర్తించేందుకు లోకల్ నిఘా పెంచాలని జలమండలి భావిస్తుంది. ఇందుకు గాను పానీ యాప్ పేరిట ప్రత్యేక యాప్ ను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టనుంది. ఈ ప్రయత్నంలో భాగంగా తొలుత సేవ్ వాటర్ వాలంటీర్ల నియామక ప్రక్రియను చేపట్టింది. సేవ్ వాటర్ వాలంటీర్ గా సేవలందించాలనుకునే వారు జలమండలి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో తన వివరాలను నమోదు చేసుకోవచ్చునని సూచించింది. పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, పొటో, చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీలను సమర్పిస్తే చాలు, వాటిని పరిశీలించి, అర్హులైన వాలంటీర్లను ఎంపిక చేస్తామని జలమండలి అధికారులు తెలిపారు.
Also read: గులాబీ కోటలో ముదురుతున్న అంతర్గత యుద్దం.. అక్కడే క్లాస్ పీకపోతున్న బాస్..!
జలమండలిలో ఆశించిన స్థాయిలో సిబ్బంది లేకపోవటం, ఉన్న సిబ్బందికి రకరకాల విధులు నిర్వహిస్తుండటంతో సుమారు 2 వేల చదరపు కిలోమీటర్ల జలమండలి పరిధిలో నీటి వృధాను అడ్డుకునేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని జలమండలి అభ్యర్థిస్తున సంగతి తెల్సిందే. ఎంపిక చేసిన వారికే జలమండలి పానీ యాప్ లింక్ ఇవ్వాలని భావిస్తుంది. ఈ లింకులో వాలంటీర్లు నీటి వృధాపై ఫిర్యాదులు, ఫొటోలు పోస్టు చేస్తే చాలని, ఆ తర్వాత ప్రక్రియను తాము చూసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఎవర్ని బడితే వారిని ఈ యాప్ పరిధిలోకి తీసుకువస్తే మున్ముందు బ్లాక్ మెయిల్ వంటివి చోటుచేసుకునే అవకాశాలుండటంతో సక్రమంగా బిల్లులు చెల్లిస్తున్న వారిని, స్థానికంగా కొంత సామాజిక బాధ్యతతో వ్యవహారించే వారిని పానీ యాప్ లో భాగస్వాములను చేయాలని జలమండలి యోచిస్తుంది.
ఈ రకంగా ఎంపిక చేసిన వినియోగదారులకే త్వరలోనే ఈ యాప్ లింకును పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో బాధ్యతాయుతంగా వ్యవహారించే పౌరులకు ఈ యాప్ లింకును పంపితే తాము ఆశించిన ఫలితం దక్కి, ప్రస్తుతం వృధా చేస్తున్న నీటిలో కనీసం 20 శాతమైన తగ్గే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. సీటిని వృధా చేసే యజమాని ఫొటో ఆధారంగా కనెక్షన్ నెంబర్ కు జరిమానా విధించి, ఆయన ఖాతాలో జమ చేయనున్నారు. ఇది సకాలంలో చెల్లించని పక్షంలో వడ్డీ కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు.
Also Read: సుప్రీంకోర్టులో ఊరట లభించేనా? ఓటుకు నోటు కేసుపై సర్వత్రా ఉత్కంఠ