భాగ్యనగరంలో వాతావరణం అనూహ్య మలుపు తిరిగింది. బుధవారం ఉదయం భానుడు తన ప్రతాపాన్ని చూపించగా.. మధ్యాహ్నం సమయానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆకాశం దట్టమైన మేఘాలతో నిండిపోయింది. ఎండ వేడితో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఈ మార్పు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ.. భారీ వర్ష సూచనతో కొంత ఆందోళన కూడా మొదలైంది. బంగాళాఖాతంలో మూడు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. దీని కారణంగా హైదరాబాద్తో పాటు రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాల్లో ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
వాతావరణ శాఖ ఇప్పటికే హైదరాబాద్ మహా నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంటే రాబోయే కొన్ని గంటల్లో వాతావరణం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వాయువ్య హైదరాబాద్ ప్రాంతాలైన కూకట్పల్లి.. శేరిలింగంపల్లి.. గచ్చిబౌలి పరిసరాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవి స్వల్పకాలికంగా సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు మాత్రమే వర్షం పడే అకవాశం ఉండవచ్చు. సుమారు 5 నుండి 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే వీలుంది. వాతావరణంలో మిగిలి ఉన్న తేమ కారణంగానే ఈ ఆకస్మిక మార్పులు సంభవిస్తున్నాయి.
నగరంతో పాటు పొరుగు జిల్లాలైన వికారాబాద్.. మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా రాబోయే రెండు గంటల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని అంచనా. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వర్షం కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద వాహనాలు నిలపవద్దని హెచ్చరించారు.
సాయంత్రం వేళ వర్షం పడితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం మెండుగా ఉంది. ఆకస్మిక వర్షాల వల్ల రోడ్లపై నీరు చేరి వాహనదారులకు ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగులు ముందుగానే ఇంటికి వెళ్లడం మంచిదని అధికారులు చెబుతున్నారు. భాగ్య నగర వాసులు నడుస్తున్నప్పుడు మ్యాన్హోల్స్.. తెరిచి ఉన్న డ్రైనేజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది. ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: Health Tips: ఆరోగ్యం జాగ్రత్త, ఈ మార్పులు కనిపిస్తే.. వెంటనే అలర్ట్ అవ్వండి