Hydra Demolitions: మహానగరంలో మాయగాళ్లకు కొదవే లేదు. వందల, వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ప్లాట్లుగా అమ్ముకుంటున్నారు. దీంతో హైడ్రా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఓ వైపు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూనే.. మరోవైపు ప్రభుత్వ స్థలాలను పరిరక్షిస్తోంది హైడ్రా.
నిన్న ఒక్కరోజే 5వేల కోట్ల విలువైన భూములకు విముక్తి కల్పించారు. హైడ్రా చరిత్రలోనే అతిపెద్ద అపరేషన్ చేపట్టారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలిగించింది హైడ్రా. హఫీజ్పేట్, రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు కూల్చేసింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి కోర్టుల్లో కేసులున్నప్పటికీ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరీ ఆక్రమణలకు పాల్పడ్డట్టు గుర్తించారు అధికారులు. శేరిలింగంపల్లి మున్సిపాల్టీ, కొండాపూర్లోని హఫీజ్ పేట్ సర్వే నంబర్ 79 లో మొత్తం 39. 2 ఎకరాలుండా ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు జరిగాయి. సర్వే నెంబర్ 79 ప్రభుత్వ భూమి. నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డులలో నమోదై ఉంది. ఆ సర్వే నంబర్ 79\1 గా సృష్టించి.. ప్రభుత్వ వ్యవస్థలను తప్పుదోవ పట్టించి అక్రమ నిర్మాణాలు చేపట్టింది వసంత హోమ్స్ సంస్థ.
ఇప్పటికే 19 ఎకరాలను కాజేసి ఇళ్లు నిర్మించి అమ్మేసింది. ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీసుతో పాటు, పలు షెడ్లను ఏర్పాటు చేసి.. వివిధ సంస్థలకు అద్దెకు ఇచ్చింది వసంత హౌసింగ్ కంపెనీ. ఈ భూములపై సుప్రీం కోర్టులో ఎంతో కాలంగా.. C. S. 14/58 అనే వాజ్యం పెండింగులో ఉంది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ.. అక్రమ నిర్మాణాలు చేపట్టి వివిధ సంస్థలకు అద్దెకిచ్చారు. ఈ భూములపై కేసులున్నాయి. ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న నిబంధనలున్నాయి. అయినా సరే పట్టించుకోకుండా నిర్మాణాలు సాగించినట్టు తెలుస్తోంది.
ఫైనల్ డిక్రీ రాకుండానే ఈ భూములలో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారనీ పై వ్యాజ్యాన్ని విచారిస్తున్న సందర్భంగా విస్మయం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. ప్రహరీతో పాటు లోపల చేపట్టన నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది హైడ్రా.
అసలు ఇదంతా ఎలా బయట పడిందంటే.. కొందరు క్రికెట్ ఆడే యువకుల వల్ల. తాము రోజూ.. ఆడుకునే చోట ఆడనివ్వడం లేదనీ.. అక్కడ చెరువును కూడా మాయం చేస్తున్నారనీ.. రహదారులు సైతం నిర్మిస్తున్నారనీ.. ఇక్కడ క్రికెట్ ఆడే యువకులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగింది హైడ్రా.
Also Read: ఆ 2వేల మందిపై.. సర్కారును గిల్లుతున్న స్మిత?
షేక్ పేట్ మండలం, రాయదుర్గం దర్గా దగ్గర్లోని సర్వే నెంబర్ 5\2లో క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా.. 39 ఎకరాల వరకూ ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు జరుగుతున్నట్టు నిర్దారించింది. ఒక వైపు అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కేసులకు సంబంధించి బోర్డులున్నా కూడా.. మరో వైపు ప్లాట్ల కొనుగోలుకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లతో సహా బోర్డు ఏర్పాటు చేసింది నార్నే ఎస్టేట్స్ సంస్థ.
అనుమతి లేని లే- ఔట్ తో రహదారులు నిర్మిస్తూ.. ప్లాట్లు అమ్మకాలు చేపట్టారు ఆక్రమణదారులు. అక్కడ చెరువును కూడా కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మకాలు సాగిస్తోంది నార్నే ఎస్టేట్స్. హఫీజ్ పేట్, రాయదుర్గం ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బోర్డులు పెట్టింది హైడ్రా. ఆక్రమణదారులపై పోలీసు కేసులు నమోదు చేయించింది హైడ్రా.