Hyderabad News: హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే బాధితుడ్ని కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి చికిత్స అందిస్తున్నారు. అయినా కృష్ణ చైతన్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తి గత కారణాలతో ఆత్మహత్యకి పాల్పడినట్లు తెలుస్తోంది.
హైడ్రా కమిషనర్ గన్మెన్ ఆత్మహత్యాయత్నం
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. హయత్నగర్లో నివాసం ఉంటున్న కృష్ణ చైతన్య ఆదివారం ఉదయం తన గన్తో పేల్చుకున్నాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ని కామినేని ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్కి బానిసైన కృష్ణ చైతన్య, భారీగా నష్టపోయాడు. వచ్చే జీతాన్ని పూర్తిగా బెట్టింగ్ యాప్స్లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం
ఈ ఘటన గురించి హైడ్రా సీపీ రంగనాథ్ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రి డాక్టర్లతో ఆయన మాట్లాడారు. కృష్ణ చైతన్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. గన్ ఫైర్ చేసిన సమయంలో బుల్లెట్ తల కొంచెం పక్క నుండి వెళ్లి నట్లు వైద్యులు వెల్లడించారు. కృష్ణ చైతన్యకు వివాహం జరిగి ఐదేళ్లు అవుతోంది. ఇంకా పిల్లలు పుట్టలేదని తెలుస్తోంది. ఈ ఘటన వెనుక ఇదీ కూడా ఓ కారణంగా తెలుస్తోంది.
శనివారం కూడా హైడ్రా సీపీ రంగానాథ్తో ఉదయం నుండి విధుల్లో ఉన్నాడు కృష్ణ చైతన్య. అయితే గన్ డిపాజిట్ చేయకుండా వెంట తీసుకెళ్లాడు. ఈ లెక్కన ప్లాన్ ప్రకారం అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణ చైతన్యకు పలుసార్లు కమిషనర్ రంగనాథ్ కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
ALSO READ: బీఆర్ఎస్-బీజేపీ మధ్య ఏం జరుగుతోంది? సీఎం రేవంత్ చెప్పింది కరెక్టేనా?
ఈ విషయాన్ని సంచలనం చేయవద్దని మీడియాను హైడ్రా చీఫ్ రంగనాథ్ కోరారు. దాదాపు రెండేళ్ల కిందట బెట్టింగ్ యాప్లు/గేమింగ్ యాప్లలో పాల్గొనడం వల్ల అతడు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడని తెలిపారు. అప్పుల కారణంగా జీతంలో ఎక్కువ భాగం కట్ అవుతోందన్నారు.
ఆదివారం ఉదయం ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలిపారు. అతడికి ఆసుపత్రిలో సర్జరీ జరుగుతోందన్నారు. బతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని తెలిపారు. దాదాపు 3 నెలల కిందట అతడు కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఇంటి నుండి వెళ్లిపోయాడని తెలిపారు.
అప్పుడే హయత్నగర్ పీఎస్లో కేసు నమోదైందన్నారు. వెంటనే కామినేని ఆసుపత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించినట్టు తెలిపారు. వైద్యానికి హైడ్రా చేయూత అందిస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పారు హైడ్రా కమిషనర్. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.