Hydraa: ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపుల సీజ్ చేసే విషయంలో హైడ్రా కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. తొలుత వ్యాపారస్తులకు ఫైర్ సేఫ్టీపై అవర్నెస్ కల్పించి, ఆ తర్వాతే కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో షాపుల తనిఖీలు, సీజ్ ప్రక్రియలకు హైడ్రా నెల రోజుల విరామాన్ని ప్రకటించిందనే చెప్పవచ్చు. ఈ నెల రోజుల గడువులో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా షాపులు, వ్యాపార సముదాయాలకు చెందిన యాజమాన్యాలతో కలిసి జాగ్రత్తలూ తీసుకోవాలని హైడ్రా(Hydraa) నిర్ణయించింది. నెల తర్వాత తనిఖీలు ముమ్మరం చేసి నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని హైడ్రా హెచ్చరించింది. ఈ మేరకు షాపుల యజమానులు, వ్యాపార సంఘాల ప్రతినిధులతో పాటు హైడ్రా,(Hydraa) జీహెచ్ఎంసీ(GHMC), ఫైర్, విద్యుత్ శాఖల అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశం కూడా నిర్వహించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను వివరించారు. అగ్ని ప్రమాదాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఫైర్, పోలీసు విభాగాలతో హైడ్రా తనిఖీలు చేసి 9 షాపుల వరకూ సీజ్ చేసిన సంగతి తెల్సిందే. నెల రోజులు గడువు కావాలని పలు వ్యాపార సంఘాలు, దుకాణదారుల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని హైడ్రా వారికి ఫస్ట్ అవర్నెస్ కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తామని పేర్కొంటూ ఆ 9 షాపుల యాజమాన్యాల నుంచి అషిడవిట్లు తీసుకున్న తర్వాతే వ్యాపారాలకు అనుమతివ్వాలని సమావేశం నిర్ణయించింది. భవిష్యత్తులో పొరపాటు జరిగితే ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించింది.
పాతబస్తీ, బేగంబజార్, ట్రూప్ బజార్, మదీన సెంటర్ ఇలా ముఖ్యమైన వ్యాపార సముదాయాలున్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించి అందిరిలో చైతన్యం తీసుకు వస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం తెలిపారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, ఫైర్ విభాగాలతో కలిసి ఫైర్ సేఫ్టీ నిబంధనలు రూపొందిస్తున్నామన్నారు. కరపత్రాలలో ఈ నిబంధనలను ప్రచారం చేస్తామన్నారు. వ్యాపార సముదాయాలు, దుకాణాలు ఉన్న చోట సమావేశాలు ఏర్పాటు చేసి అందరిలో ఫైర్ సేఫ్టీకి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ?అవగాహన కల్పిస్తామన్నారు. ఒక వేళ అగ్ని ప్రమాదం జరిగితే అందులో ఉన్న వారు సులభంగా బయటకు వచ్చేలా కారిడార్లు, మెట్ల దారులు స్పష్టంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వస్త్రాలు, ప్లాస్టిక్ వస్తువులు, పెయింట్, ఆయిల్, కెమికల్ డబ్బాలు, యాసిడ్ నిలువలు, టైర్లు, ఫైబర్ వస్తువులు, ఫోమ్ ఇలా మండే స్వభావం ఉన్న వస్తువుల నిల్వలు ఎక్కువ మొత్తంలో లేకుండా దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన అగ్ని ప్రమాదాల వీడియోలను ప్రదర్శించి, కారణాలను వివరించారు.
సెల్లార్లను ఆయా షాపుల వారు గోదాములుగా మార్చవద్దని హైడ్రా కమిషనర్ సూచించారు. పై అంతస్తుల్లో ప్రమాదం జరిగినా కిందకు దిగి వెళ్లడానికి వీలుంటుందన్న విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. సెల్లార్లలోనే ప్రమాదం జరిగితే అగ్గిలో దూకే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. సెల్లార్ల నిండా స్టాక్ పెట్టి వాటిని కాపాడే క్రమంలో గ్రిల్స్ ఏర్పాటు చేయడం, వాటికి తాళాం వేయడంతో నాంపల్లి ఘటనలో ఐదుగురు మృతికి కారణమైందన్నారు. ఇటీవల తనిఖీల్లో ప్రమాదకరంగా నిల్వలు సెల్లార్లలో గమనించామని, అందుకే సీజ్ చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. సెల్లార్లను వాహనాల పార్కింగ్ కోసమే వినియోగిస్తే, ట్రాఫిక్ జామ్ లు తగ్గటంతో పాటు కొనుగోలుదారులకు సౌకర్యంగా ఉంటుందన్నారు.
Also Read: Municipal Elections: త్వరలో తొర్రూరును దత్తత తీసుకుంటా: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి