Hydraa: లోతుకుంట భూముల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హైడ్రా రియార్ట్ అయ్యింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని లోతుకుంట ప్రాంతంలో 106 ఎకరాల భూమికి శనివారం హైడ్రా కంచె వేయడం జఠిలమైంది. వివాదాస్పద భూమి- కంచె వేసిన భూమికి మధ్య మూడు కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది హైడ్రా.
లోతుకుంట భూముల హైడ్రా క్లారిటీ- మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాతోపాటు హైదరాబాద్ జిల్లా పరిధిలోని కంటోన్మెంట్లోవున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించింది. అందులో ప్రైవేటు పట్టాలు ఏమీ లేవని స్పష్టం చేసింది. కంటోన్మెంట్ పరిధిలోని ప్రభుత్వ భూములుగా వాటిని పేర్కొంది. ఈ భూముల ఆక్రమణలు తొలగించడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది.
వివరాలు బయటపెట్టిన హైడ్రా-శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్కు చెందిన భూమి లోతుకుంటలోని సర్వే నంబరు 1, 2లలో ఉండగా, హైడ్రా కాపాడిన ప్రభుత్వ భూమి కంటోన్మెంట్ పరిధిలోని జీఎల్ ఆర్ నంబరు 243లో 119 ఎకరాలు, 255లో 29 ఎకరాలకు పైగా ఉందని స్పష్టం చేసింది. ఈ రెండు భూముల మధ్య దూరం మూడు కిలోమీటర్లని తెలిపింది. సర్వే నెం. 1, 2 లకు సంబంధించి ప్రైవేట్ భూమిపై కోర్టు ఉత్తర్వులతో జీఎల్ఆర్ నెం. 243-255 లకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
వాటి మధ్య దూరం మూడు కిలోమీటర్లు- కంటోన్మెంట్ ప్రాంత పరిధిలోని జీఎల్ఆర్ 243, 255లలోని ప్రభుత్వానికి చెందిన 148 ఎకరాల భూమి ఉందని తెలిపింది హైడ్రా. అందులో సహజ సిద్ధమైన కొండలు, చెట్లు, నెమళ్లు, కుందేళ్లు స్వేచ్ఛగా తిరుగుతాయని వివరించింది. రాత్రిపూట ఆ కొండలను బ్లాస్ట్ చేయడంతో అక్రమ మైనింగ్ జరుగుతోందని పర్యావరణవేత్తలు ఏజెన్సీకి ఫిర్యాదు చేసినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత హైడ్రా ఆ భూమికి కంచె వేసిందని తెలిపింది. దీనివల్ల రూ. 10 వేల విలువైన ప్రజా ఆస్తిని పరిరక్షించిందని పేర్కొంది.
సర్వే నంబర్లను మార్చి సవరించిన లేఅవుట్ అనుమతి కోసం శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ దరఖాస్తుపై రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. పూర్తిస్థాయి సర్వే నిర్వహించిన తర్వాత ఈ విషయాలు స్పష్టమవుతాయని హైడ్రా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయం హైకోర్టులో ఉన్నందున అన్ని వివరాలను వెల్లడించలేమని తెలిపింది. హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో పై వివరాలను హైడ్రా వెల్లడించింది.
లోతుకుంట భూముల వ్యవహారం ఏంటి? సికింద్రాబాద్లోని లోతుకుంట భూముల వివాదంలో హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా ఆర్మీ భూముల్లోకి హైడ్రా అధికారులు మళ్లీ ప్రవేశిస్తే వారిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే సంకెళ్లు వేయాలని ఆర్మీ అధికారులకు తెలంగాణ హైకోర్టు సూచించింది. లోతుకుంట భూముల వ్యవహారంపై గురువారం జరిగిన విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాస్పద భూముల్లో ఎవరైనా ప్రవేశిస్తే చట్టప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
ఈ అంశంపై పలుమార్లు హెచ్చరించినా హైడ్రా అధికారుల వైఖరిలో మార్పు లేకపోవడంపై తీవ్రంగా స్పందించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అధికారులను ఆర్మీ కస్టడీకి అప్పగించడానికీ వెనుకాడబోమని వ్యాఖ్యానించింది. వివాదాస్పద భూముల వద్ద శాంతిభద్రతలు పరిరక్షించేందుకు ఆర్మీ బలగాలను మోహరించాలని పేర్కొంది. 10 మంది జవాన్లతో భద్రత ఏర్పాటు చేయాలని సూచించింది. హైడ్రా తరఫున అడ్వకేట్ జనరల్ మాట్లాడారు. అధికారులు వివాదాస్పద భూముల్లోకి ప్రవేశించలేదని తెలిపారు. దీనిపై అఫిడవిట్ వేయాలని ఏజీని ఆదేశించింది హైకోర్టు.