Illegal Bakery: స్వేచ్ఛ బ్యూరో: అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ ముడి పదార్థాలతో ఉస్మానియా బిస్కెట్ తోపాటు బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తున్న కేంద్రంపై గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి దాడి చేశారు. తనిఖీలు జరిపి 12.54లక్షల రూపాయల విలువ చేసే వస్తువులు, ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
కేడీ కాలనీ నివాసి అహ్మద్ రజా (46) వ్యాపారి. ఎలాంటి లైసెన్స్ తీసుకోకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో నాసిరకం ముడి పదార్థాలతో ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు, బటర్ బన్ తదితర వాటిని తయారు చేస్తూ కిరాణా షాపులు, హోటళ్లు, కేఫ్ లకు సరఫరా చేస్తున్నాడు. ఈ మేరకు సమాచారాన్ని సేకరించిన టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటేశ్, గుడిమల్కాపూర్ సీఐ రామయ్య, ఎస్ఐలు వెంకటరమణ, సురేశ్ తోపాటు సిబ్బందితో కలిసి తయారీ కేంద్రంపై దాడి చేశారు.
Also Read: Film industry: ఇండస్ట్రీలో విషాదం.. ఆయన లోటు తీర్చరానిది!
తనిఖీలు జరిపి 60 బస్తాల మైదా పిండి, 30 బస్తాల చక్కెర, 47 బాక్సుల పామాయిల్ బాక్సులు, 188 బాక్సుల హిమానీ బేక్ మ్యాజిక్ నెయ్యితోపాటు తయారు చేసి సిద్ధంగా పెట్టిన ఉస్మానియా బిస్కెట్లు, ఫ్యాన్ బిస్కెట్లు, రస్కులు, బటర్ బన్ లను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు షుగర్ గ్రైండింగ్ మిషన్, స్పైరల్ మిక్సర్, ఓవెన్ తదితర పరికరాలను కూడా సీజ్ చేశారు. అహ్మద్ రజాను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు.
Also read: Kishan Reddy: సమస్యకు పరిష్కారం.. ఇందన కొరత పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి