TG Ration Card: స్వేచ్చ బ్యూరో: అర్హులైన నిరుపేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు, అధికారుల నిర్లక్ష్యం మరియు క్షేత్రస్థాయి పరిశీలన లోపం కారణంగా అనర్హుల పాలువుతున్నాయనే ఆరోపణలు జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉండి, స్థిరమైన మరియు భారీ ఆదాయం పొందుతున్నప్పటికీ వారికి రేషన్ కార్డు జారీ అయిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జిల్లాలోని మల్దకల్ మండల కేంద్రానికి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. వారిలో ఒకరు విద్యుత్ శాఖలో, మరొకరు వ్యవసాయ శాఖలో, ఇంకొకరు అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వర్తిస్తూ నెలకు ప్రభుత్వాల నుండి స్థిరమైన జీతాలు పొందుతున్నారు. ఇంతటి ఆర్థిక స్థోమత కలిగిన సదరు కుటుంబం పేరిట మల్దకల్ మండల కేంద్రంలో (రేషన్ కార్డు నంబర్: 369230128157) పై ఇప్పటికీ రేషన్ కార్డు కొనసాగుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read: RV Karnan: జీహెచ్ఎంసీలో పెద్దన్న మౌనం.. అసలు కారణం అదేనా..?
రేషన్ కార్డుల జారీ సమయంలో దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం, ఉద్యోగ వివరాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులను పూర్తిగా పరిశీలించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే క్షేత్రస్థాయిలో సరైన దర్యాప్తు చేయకపోవడం వల్లే ఇలాంటి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. గ్రామాల్లో ఎంతోమంది నిరుపేదలు, కూలీలు రేషన్ కార్డులు రాక సంక్షేమ పథకాలకు దూరమవుతుంటే, ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు రేషన్ కార్డులు ఎలా కొనసాగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు మరియు పౌరసరఫరాల శాఖ అధికారులు తక్షణమే స్పందించి, పూర్తిస్థాయి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు, జిల్లా ప్రజలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, అర్హత లేకుండా రేషన్ కార్డు పొందినట్లు తేలితే సదరు కార్డును తక్షణమే రద్దు చేయాలని, తప్పుడు వివరాలతో లబ్ధి పొందుతున్న వారిపై మరియు ఇందుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also read: Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖకు.. మరో అంతర్జాతీయ స్థాయి ఘనత..!