Telangana Weather: తెలంగాణ గజగజ వణికిపోతోంది. అలా ఇలా కాదు.. సాయంత్రం అయిందంటే చాలు.. వణుకుడే వణుకుడు. ఇదేమి వణుకుడు అనుకోవద్దు సుమా.. తెలంగాణ వ్యాప్తంగా చలిగాలుల ఎఫెక్ట్ ఇది. చిన్నా పెద్దా తేడా లేకుండా అలా బయటకు రావలన్నా హడలెత్తి పోతున్నారు చలి దెబ్బకు. అలాంటి మరో ప్రకటన చేసింది వాతావరణ శాఖ. రేపు అంటే 20వ తేదీన చలిగాలుల ఎఫెక్ట్ భారీ స్థాయిలో ఉంటుందని వాతావారణ శాఖ ప్రకటించింది.
చలికాలం వచ్చిందని ఆనందం ఏమో కానీ, చలిగాలుల ధాటికి మాత్రం ప్రజలు తెగ అల్లాడి పోతున్నారు. ఏపీలో చలి ఎఫెక్ట్ కంటే తెలంగాణపై చలి పులి ఎఫెక్ట్ అధికంగా ఉందని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో ఉదయం, సాయంత్రం ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్న పరిస్థితి. ప్రధానంగా ఉదయం 10 గంటల వరకు కూడా చలి ప్రభావం అధికంగా ఉండడంతో, విద్యార్థులు బడికి వెళ్లేందుకు కూడ ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే వృద్దులు కూడా చలిబారి నుండి ఉపశమనం పొందేందుకు ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు అనగా 20వ తేదీన తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, ఈ జిల్లాల్లో 5 నుంచి 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. హన్మకొండ, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించగా, ఈ జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల వరకు నమోదవనున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయట.
Also Read: Formula E Race Case: ఫార్ములా కార్ రేస్ కేసులో సంచలనం.. ఏ1గా కేటీఆర్.. ఏ2గా అరవింద్ కుమార్
ఇప్పటికే చలిగాలుల ధాటికి ముప్పుతిప్పలు పడుతున్న ప్రజలు, రేపటి రోజు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ కోరింది. అయితే చలిగాలులతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను కూడా అప్రమత్తం చేసింది. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, ఏవైనా జ్వర లక్షణాలు ఉంటే వెంటనే వైద్యశాలను సంప్రదించాలని ప్రభుత్వం కోరింది. మొత్తం మీద తెలంగాణ లోని ఆయా జిల్లాల ప్రజలు, చలిపులి బారి నుండి రేపు మాత్రం తస్మాత్ జాగ్రత్త సుమా!