Indiramma Houses: స్వేచ్చ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 3.60 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా ఇందులో లక్ష ఇండ్లకు ఈనెల 31వ తేదీలోగా గృహప్రవేశాలు జరుగనున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలోనే గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలను అధికారికంగా తెలియజేస్తామని వెల్లడించారు. ఇండ్లు మంజూరు చేసిన తర్వాత కూడా కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ పూరిగుడిసెలు కనిపిస్తున్నాయని, అలాంటి కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇండ్ల నిర్మాణంలో చేర్చాలని మంత్రి ఆదేశించారు.
హైదరాబాద్ సెక్రటేరియట్ లోని తన కార్యాలయం నుంచి శనివారం ప్రజాపాలన-ప్రగతి నివేదిక 99 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం నిర్మాణం పూర్తికి దగ్గరగా ఉన్న ఇండ్లను సమర్థంగా సమన్వయం చేసుకుని జూన్ చివరినాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏప్రిల్ లో రెండో దశ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేనాటికి మొదటి దశ ఇందిరమ్మ ఇండ్లు కొలిక్కిరావాలని సూచించారు. ఇండ్ల నిర్మాణంలో ఉపయోగించే నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల లబ్ధిదారులపై అదనపు భారం పడకుండా జిల్లాస్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు చురుకుగా పనిచేయాలని మంత్రి సూచించారు. అవసరమైతే కలెక్టర్లతో కలిసి సమీక్షించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు.
Also Read; Anasuya Bharadwaj: పట్టు చీరలు పుత్తడి బొమ్మల ఆకట్టుకుంటున్న అనసూయ!
ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకల సరఫరా పెంచేందుకు స్థానికంగా ఎస్ హెచ్ జీ మహిళా సంఘాల ద్వారా బ్రిక్ యూనిట్లను ప్రోత్సహించాలని మంత్రి తెలిపారు. అవసరమైతే ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా సరఫరా పెరిగి ధరలు నియంత్రణలో ఉండే అవకాశముందని అన్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఒకటి లేదా రెండు విడుతల చెల్లింపులు చేసిన తర్వాత వివిధ కారణాలతో చెల్లింపులు నిలిపివేయడం సరికాదని మంత్రి తెలిపారు. ఇటువంటి చెల్లింపులను తక్షణమే క్లియర్ చేయాలని, లేదంటే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏస్ధాయిలో నిర్మాణంలో ఉన్నా డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను కూడా మార్చి 31లోపు పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో హౌసింగ్ కార్యదర్శి వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Foreign MBBS: విదేశాల్లో ఎంబీబీఎస్ చదివినంత మాత్రాన డాక్టర్ కాదట.. ఇవి కూడా చేయాల్సిందే నట..?