Hyderabad: అలా నడుస్తూ వెళ్తున్న పిల్లల మైండ్లో ఏం రన్ అవుతుందనుకుంటున్నారు? మేం మా ఇంటికే కదా వెళ్తున్నాం.. కానీ ఎందుకిలా బురదలా మారింది? వర్షం పడిన ప్రతిసారీ ఎందుకిలా జరుగుతుంది? అని ఒకసారి కాకపోయినా ఒకసారి ఆలోచించి ఉంటారు కదా. ఇది మనం నెక్ట్స్ తరానికి ఇస్తున్న మెసేజ్. చిన్నపాటి వర్షానికే మనం ఇన్ని పాట్లు పడాలని చెప్పకనే చెబుతున్నాం. నిజానికి ఆకాశానికి చిల్లు పడలేదు.. జస్ట్ ఓ అరగంట పాటు మోస్తరు వాన పడింది అంతే.. కానీ పరిస్థితి ఎలా మారిందో చూడండి.
ఐటీ కారిడార్ నుంచి.. ఓల్డ్ సిటీ వరకు
చినుకు పడితే చాలు భాగ్యనగరం భయనగరంగా మారిపోతుంది. రోడ్లన్ని చిత్తడి.. సెల్లార్లేమో ఇలా మారుతున్నాయి. ఐటీ కారిడార్ నుంచి.. ఓల్డ్ సిటీ వరకు.. ఇవే సీన్స్. ఇంకాస్తా వర్షం పడితే మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లో వందలాది సెల్లార్లు జలమయమవుతాయి. ప్రతి వర్షాకాలం కనిపించే సీన్స్ ఇవే. బైక్లు మునుగుతాయి. లగ్జరీ కార్లు బోట్లుగా మారుతాయి. మళ్లీ వాటిని రిపేర్లు చేయించుకోవడానికి నానా కష్టాలు పడాలి. అపార్ట్మెంట్ సెల్లార్లలోనే ఉండే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు నీటిలో మునిగిపోతుండటంతో గంటల తరబడి కరెంట్ కోతలు విధిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ అవుతుందేమోనన్న భయంతో జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి.
అసలు లోపం ఎక్కడుంది..?
మరి అసలు లోపం ఎక్కడుంది? ప్రతి ఏడాది ఇదే ప్రశ్న. కానీ దీనికి సమాధానం ఒకప్పుడు హైదరాబాద్లో చెరువులు, కుంటలు, సహజసిద్ధమైన నాలాలు విస్తారంగా ఉండేవి. రియల్ ఎస్టేట్ ఊపులో వాటన్నింటినీ పూడ్చేసి అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించారు. నీరు ప్రవహించాల్సిన దారిని మూసేస్తే, అది సెల్లార్లలోకి కాక ఎక్కడికి వెళ్తుంది?. జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం సెల్లార్ నిర్మాణం చేపట్టేటప్పుడు డ్రైనేజీ లెవెల్ కంటే ఎత్తును సరిచూసుకోవాలి. కానీ అలాంటి సెల్లార్లు మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? అనేక ప్రాంతాల్లో రోడ్డు మట్టం కంటే సెల్లార్లు చాలా లోతుగా నిర్మిస్తున్నారు. రోడ్లపై ప్రవహించే నీరు నేరుగా సెల్లార్లలోకి దూసుకుపోయేలా ర్యాంపులు ఉండటం మరో పెద్ద మైనస్.
ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ..?
అంతేకాదు సెల్లార్లలోకి చేరిన నీటిని వెంటనే బయటకు పంపే బలమైన ఆటోమేటిక్ పంపింగ్ సిస్టమ్స్ చాలా అపార్ట్మెంట్లలో లేవు. వర్షపు నీటి సంరక్షణ గుంతలు కేవలం కాగితాలకే పరిమితం కావడంతో భూమిలోకి నీరు ఇంకడం లేదు. ఈ సెల్లార్ల మునక నుంచి బయటపడాలంటే కేవలం అధికారులను నిందిస్తే సరిపోదు, నిర్మాణ శైలిలోనూ మార్పులు రావాలని నిపుణులు పదే పదే చెబుతున్నారు. కానీ పట్టించుకున్న నాథుడే లేడు.
Also Read: తాగి బండెక్కితే కేసులు పెట్టొద్దు.. పోలీసులకు ఏలూరు ఎంపీ వింత రిక్వెస్ట్!
ఈ భవనాలకు జీహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వకుడదు
ఇక జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారుల తీరు ఇందుకు అసలైన కారణం. సెల్లార్లలో సరైన డ్రైనేజీ ఔట్లెట్, హై-కెపాసిటీ మోటార్లు లేని భవనాలకు జీహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వకూడదు. కానీ అలా జరగదు. అనుమతులు ఇచ్చేది ఒకరు.. అవి తప్పని చెప్తూ కూల్చేది మరొకరు. సగం సమస్య ఇక్కడే ఉంది. జీహెచ్ఎంసీ బిల్డింగ్ బైలాస్ ప్రకారం నిర్మాణం ఉందా? లేదా? అని పరిశీలించే వారి దగ్గరే అసలైన సమస్య ఉంది. అంతేకాదు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం చేసే మరో పెద్ద తప్పు రోడ్డు వేసే విధానం. నగరంలో ప్రతి ఏటా రోడ్లు వేసేటప్పుడు పాత రోడ్డును తొలగించకుండా, దానిపైనే కొత్త లేయర్ వేసుకుంటూ వెళ్తారు. దీంతో రోడ్డు ఎత్తు నిరంతరం పెరుగుతూ పోతోంది. భవనాల సెల్లార్లు, ర్యాంపులు రోడ్డు కంటే బాగా లోతుకు పడిపోతున్నాయి. దీనివల్ల రోడ్డుపై ప్రవహించే నీరంతా సహజంగానే పల్లపు ప్రాంతమైన సెల్లార్లలోకి దూసుకుపోతోంది.
జీహెచ్ఎంసీ నిర్వాహకం
వర్షపు నీరు రోడ్ల మీద నిలవకుండా నాలాల్లోకి వెళ్లేలా చేసే స్టార్మ్ వాటర్ డ్రైయిన్స్ నిర్వహణను జీహెచ్ఎంసీ పూర్తిగా గాలికి వదిలేసింది. రోడ్ల పక్కన ఉండే డ్రైనేజీ హోల్స్ చెత్తతో పూడుకుపోయినా పట్టించుకోరు. దీంతో నీరు రోడ్లపైనే నిలిచి, చివరకు సెల్లార్లను ముంచెత్తుతోంది. ఇక ప్రతిసారి చెప్పుకున్నట్టే.. నగరంలో ఎన్నో నాలాలు, చెరువుల బఫర్ జోన్లు ఆక్రమణకు గురయ్యాయి. ఇది మరో మైనస్.
స్విమ్మింగ్ పూల్స్గా మారుతున్న సెల్లార్లు
హైదరాబాద్ గ్లోబల్ సిటీగా దూసుకుపోతోంది. స్కై స్క్రేపర్లు నగర అందాన్ని పెంచుతున్నాయి. కానీ అడుగున ఉన్న సెల్లార్లు మాత్రం చినుకులు పడిన ప్రతిసారి ఇలా మునుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా పాలకులు, బిల్డర్లు, నగరవాసులు కళ్లు తెరవకపోతే.. రాబోయే రోజుల్లో చిన్న వర్షానికే సెల్లార్లు స్విమ్మింగ్ పూల్స్గా మారడం రోటిన్ అవుతుంది.