Adluri Laxman: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారి లేని రాష్ట్రంగా మార్చడమే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. బుధవారం లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో మంత్రి లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలన, వృద్ధుల సంక్షేమం, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సాధికారతకు ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక చర్యలపై గవర్నర్కు వివరించారు.
నషా ముక్త్ భారత్ అభియాన్ పురోగతిపై చర్చ
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం తెలంగాణలో ఏ విధంగా సాగుతుందనే పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరోధానికి తీసుకుంటున్న కఠిన చర్యలను, యువతలో డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గవర్నర్కు క్షుణ్ణంగా వివరించారు.
జూన్ 26న రాష్ట్రవ్యాప్త అవగాహన కార్యక్రమాలు
ఈ నెల 26న నిర్వహించనున్న ‘అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం’ పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోయే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు, యువజన చైతన్య సదస్సుల వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాలకు హాజరుకావాల్సిందిగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను మంత్రి లక్ష్మణ్ ఈ సందర్భంగా ఆహ్వానించారు.
Also Read: మహిళలు తలుచుకుంటే రూపురేఖలు మారాల్సిందే.. ‘వెటా’ వేదికగా మంత్రుల కీలక వ్యాఖ్యలు!
గవర్నర్ కీలక సూచనలు – అభినందనలు
యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఇందుకోసం విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు (NGOs), పోలీసు శాఖ సమన్వయంతో కలిసి పని చేయాలని, క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇదే సమయంలో సమాజంలోని అత్యంత బలహీన వర్గాలైన వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను, చర్యలను గవర్నర్ అభినందించారు.
సమావేశంలో పాల్గొన్న అధికారులు
ఉన్నతస్థాయిలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ సంచాలకురాలు బి.శైలజ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.