Foreign MBBS: స్వేచ్చ బ్యూరో: విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన భారత విద్యార్థులు ఆన్లైన్ ద్వారా పూర్తి చేసిన పాఠ్యభాగాలను తప్పనిసరిగా ప్రత్యక్షంగా (ఆఫ్లైన్) పూర్తి చేయాల్సిందేనని నేషనల్ మెడికల్ కమిషన్ స్పష్టం చేసింది. కరోనా వంటి కారణాలతో విదేశీ మెడికల్ కళాశాలల్లో ఆన్లైన్ ద్వారా చదివిన భాగాలను భర్తీ చేసేందుకు ఫిజికల్ క్లాసులు నిర్వహించాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.
విద్యార్థులు ఒక విద్యా సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా చదివిన పాఠ్యభాగాన్ని తర్వాత ఏడాది ఆఫ్లైన్లో పూర్తి చేశామని చెప్పి అకాడమిక్ పీరియడ్ పెంచకుండా సర్టిఫికెట్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ఎన్ఎంసీ తెలిపింది. మెడికల్ విద్యలో ప్రాక్టికల్ శిక్షణ, క్లినికల్ అనుభవం చాలా ముఖ్యమైనందున ఆన్లైన్ విద్యను పూర్తిగా సమానంగా పరిగణించలేమని పేర్కొంది. విదేశీ మెడికల్ కోర్సు నిర్మాణం, కాలవ్యవధి, పాఠ్యాంశాలు భారతదేశంలోని ఎంబీబీఎస్ కోర్సుకు సమానంగా ఉండాల్సిందేనని ఎన్ఎంసీ తెలిపింది. కోర్సులో తగిన క్లినికల్ శిక్షణ ఉండాలని స్పష్టం చేసింది. లేకపోతే ఆ విద్యార్థుల అర్హతలు భారత్లో గుర్తించబడకపోవచ్చని హెచ్చరించింది.
ఇక విదేశీ మెడికల్ కాలేజీలు ఇచ్చే ‘కంపెన్సేషన్ సర్టిఫికెట్’లో ఆఫ్లైన్ క్లాసులు ఎన్ని రోజులు చేశారో, ఏ సబ్జెక్టులు చదివారో, క్లినికల్ ట్రైనింగ్ వివరాలు స్పష్టంగా ఉండాలని సూచించింది. అలాగే యూనివర్సిటీ ట్రాన్స్క్రిప్ట్లను ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించాలి. 18 నవంబర్ 2021 తర్వాత విదేశీ మెడికల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు భారత్లో తప్పనిసరిగా ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుందని ఎన్ఎంసీ తెలిపింది. అంతేకాక ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ లేదా ఎఫ్ఎంజీ పరీక్ష ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని ఎన్ ఎంసీ పేర్కొన్నది. మరోవైపు విదేశాల్లో చదివిన విద్యార్థులకు భారతదేశంలో శాశ్వత రిజిస్ట్రేషన్ ఇవ్వడంపై తుది నిర్ణయం రాష్ట్ర మెడికల్ కౌన్సిళ్లదేనని ఎన్ఎంసీ స్పష్టం చేసింది.
Also Read: Horror movie OTT: మనుషుల్ని బతికుండగానే తినే ఊరు… గుండెలు జారిపోయే సీన్లు