KTR: కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల పైన కదం తొక్కాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు. బుధవారం మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో జరిగిన కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు పార్టీ కార్యక్రమాల పైన సమకాలీన రాజకీయ అంశాల పైన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ మొదటి నుంచి భారత రాష్ట్ర సమితికి ఒక కోట మాదిరిగా అండగా నిలబడిందని కెటిఆర్ గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు మోసాల వలన కొంత కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందని కెటిఆర్ అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాల విఫల పరిపాలన తర్వాత తిరిగి ప్రజలంతా భారత రాష్ట్ర సమితి వైపు మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కెసిఆర్ వైపు చూస్తున్నారన్నారు. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు మరోసారి సునామీ సృష్టించబోతుందని కెటిఆర్ అన్నారు.
అధికారులకు దిశానిర్దేశం
ఈరోజు జరిగిన సమావేశంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే నుంచి మాజీ ఎమ్మెల్యే నుంచి నియోజకవర్గాల వారిగా పార్టీ తాలూకు క్షేత్రస్థాయి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీటితోపాటు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ పైన జరుగుతున్న కార్యక్రమాలను వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక పార్టీ బలోపేతానికి సంబంధించి కెటిఆర్ పలు అంశాల పైన దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ జిల్లాలో అత్యంత కీలకమైన సింగరేణి పైన అటు బిజెపి, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలను, అవినీతిని ఎక్కడికక్కడ ప్రజల ముందుకు, సింగరేణి కార్మికుల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. కాంగ్రెస్, బిజెపి కలిసి చేస్తున్న అరాచకాలను, అవినీతిని ఎక్కడికక్కడ ఎండగట్టాలని సూచించారు.
పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా బూత్
ఇక పార్టీ నిర్మాణానికి సంబంధించి బూత్ ల వారీగా ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ముందుకు పోవాలన్నారు. కేవలం గ్రామస్థాయి పార్టీ కార్యాచరణ కాకుండా బూత్ ల వారీగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు. అధికారం ఉన్నా లేకున్నా మన వెంట నాయకుల వెంట నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తించాలని కార్యకర్తలతో తోనే పార్టీ బలంగా నిలబడింది అన్న విషయాన్ని గ్రహించి ముందుకు పోవాలని సూచించారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా బూత్ ల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని కోరారు.
Also Read: ధర్మవరం సభలో పూనకాలు.. పవన్ పాటకు మంత్రి సత్యకుమార్ యాదవ్ మాస్ స్టెప్పులు!
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు
ఇక కరీంనగర్లో కాలేశ్వరం ప్రాజెక్టు అందించిన ప్రతిఫలాలను ప్రజలకి గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరువు వచ్చినప్పుడే కాలేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుస్తుందని మనం గతంలో చెప్పిన విషయం ముమ్మాటికి నిజమవుతున్నదని ఇప్పటికే దాదాపు రెండు వారాలు దాటిపోయినా వర్షాలు పడని ఈ పరిస్థితిలోనూ పుష్కలంగా నీరు కాలేశ్వరంలో ప్రాజెక్టులో పారుతున్నదని కెటిఆర్ అన్నారు. అయినా అక్కడి నుంచి పదివేల క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎత్తిపోసి రైతన్నల నారుమడులకు అందించాలన్న కనీస సోయి కూడా లేకపోవడం కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు అద్దం పడుతుందన్నారు.
ప్రజల్లో కాంగ్రస్ వైపల్యాలు
ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు అందిన కాడికి దోచుకుంటున్న తీరును ప్రజల్లో ఎండగట్టాలన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు స్థానికంగా చేస్తున్న అరాచకాలు, అవినీతిని గమనిస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. పార్టీ నేతలంతా మారుతున్న ప్రస్తుత కాలానికి అనుగుణంగా సామాజిక మాధ్యమాల శక్తిని అర్థం చేసుకొని, వాటి ద్వారా ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం కూడా చేయాలని సూచించారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను బలంగా ఉపయోగించుకోవాలని కోరారు.