Telangana : వాసాలమర్రి. తెలంగాణలో ఈ గ్రామం పేరు తెలీని వారు ఉండరేమో. అప్పట్లో సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న ఊరు. పలుమార్లు ఆ గ్రామానికి వెళ్లారు. సభలు పెట్టారు. గొప్పగొప్ప మాటలు చెప్పారు. అది చేస్తాం, ఇది చేస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపించారు. అందరికీ ఇండ్లు కట్టిస్తానన్నారు. గ్రామస్తులతో కలిసి భోజనం కూడా చేశారు. మళ్లీ ఓపెనింగ్ రోజు వస్తా.. కళ్లుతో దావత్ ఇయ్యాలని కూడా అడిగారు. స్వయంగా సీఎం కేసీఆరే తరలివచ్చి అన్నేసి హామీలు ఇస్తే ఎవరికైనా అనుమానం ఎందుకు వస్తుంది? నిజమే కావొచ్చు అనుకున్నారంతా.
వాసాలమర్రి గోస..
మా ఊరు దశ-దిశ మారిపోతుందని వాసాలమర్రి వాసులు కలలు కన్నారు. కేసీఆర్ చెప్పినట్టే అందరికీ కొత్త ఇల్లు కట్టిస్తారని భావించారు. ఉన్న ఇండ్లు కూల్చేసుకున్నారు. ఇక అంతే. ఇళ్లు కూల్చడం వరకైతే పనులు వేగంగా సాగిపోయాయి. ఆ తర్వాతే వాసాలమర్రి గోస మొదలైంది. కేసీఆర్ అటువైపు చూడటమే మానేశారు. కూలిన ఇళ్లు, మొండిగోడలు ఏళ్ల తరబడి వెక్కిరిస్తూనే ఉన్నాయి. కేసీఆర్ ఫాంహౌజ్కు వెళ్లేందుకు విశాలమైన దారి కోసమే.. అడ్డుగా ఉన్న వాసాలమర్రిలోని ఇళ్లను కూల్చేశారనే విమర్శ కూడా ఉంది. కట్ చేస్తే.. ప్రభుత్వం మారిపోయింది. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇటీవలే జూన్ 6 వాసాలమర్రి కష్టాలు తీరుస్తానని ఓ సభలో ప్రామిస్ చేశారు. కేసీఆర్ అలానే అని మోసం చేశారు.. రేవంతన్న అయినా మంచి చేస్తారేమోనని గ్రామస్తులు ఆశతో ఎదురు చూశారు.
రేవంత్ మాటంటే మాటే..
మాటంటే మాటే. చెప్పినట్టే వాసాలమర్రి గోస తీరుస్తున్నారు సీఎం రేవంత్రెడ్డి. ఆనాడు కేసీఆర్ వల్ల ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. గ్రామంలో అర్హులందరికీ కొత్త ఇళ్లు ఇస్తున్నారు. కేసీఆర్ దత్తత గ్రామాన్ని రేవంత్రెడ్డి పునర్నిర్మిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వాసాలమర్రిలో ఏకంగా 227 మంది లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గురువారం ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. బంగారు వాసాలమర్రి చేస్తానని ఆనాటి సీఎం కేసీఆర్ గ్రామాన్ని మొండి గోడలుగా మార్చారని విమర్శించారు పొంగులేటి. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో వాసాలమర్రిని రాష్ట్రానికే మోడల్ విలేజ్గా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అరెస్ట్? కేసీఆర్కు కష్టాలే?
కేసీఆర్ దోస్త్కే మొదటి ఇల్లు..
ఇండిరమ్మ ఇళ్ల లబ్దిదారుల్లో కేసీఆర్ దోస్త్ ఆగవ్వ కూడా ఉండటం ఆసక్తికరం. ఆనాడు ఇదే ఆగవ్వను తన దోస్త్ అంటూ గొప్ప గొప్ప మాటలు చెప్పారు కేసీఆర్. ఆమె ఇంటికి వెళ్లారు. మాట్లాడారు. మంచిచెడులు అడిగి తెలుసుకున్నారు. కొత్త ఇల్లు కట్టిస్తానన్నారు. ఆగవ్వతో కలిసి భోజనం చేశారు. అంత చేసి.. అన్నేసి మాటలు చెప్పి.. నడి రోడ్డు మీద వదిలేసి వెళ్లారు. కేసీఆర్ ముచ్చట్లు నమ్మి.. ఉన్న ఇంటిని పడగొట్టేసుకుంది ఆగవ్వ. పాపం.. దిక్కులేని దానిగా మిగిలిపోయింది. ఇప్పుడు అదే ఆగవ్వకు ఇంటి స్థలం పట్టాతో పాటు లక్ష రూపాయల చెక్కును సైతం అందజేశారు మంత్రి పొంగులేటి. వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మొదటి లబ్దిదారు కూడా ఆగవ్వనే. వారెవా.. ఇది కదా ప్రజా ప్రభుత్వం.. ప్రజా పాలన.. అని అంటున్నారు గ్రామస్తులంతా.