Pension Scam: స్వేచ్ఛ బ్యూరో: హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో అనర్హులు చేనేత పింఛన్లు పొందుతున్నారన్న ఫిర్యాదులపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అధికారి శ్రీధర్ గురువారం సమగ్ర విచారణ చేపట్టారు. గ్రామంలో అనర్హులైన వారు చేనేత కార్మికుల పేరిట పింఛన్లు పొందుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో, గత రెండు నెలల క్రితమే ప్రభుత్వం 17 మంది పింఛన్లను నిలిపివేసింది. ఈ క్రమంలో మండల పరిషత్ కార్యాలయంలో సదరు 17 మంది పింఛన్దారులను విచారించి, వారి ఆధార్ కార్డులు మరియు ఇతర గుర్తింపు పత్రాలను పరిశీలించారు. ఈ విచారణకు కొందరు గైరాజరు కాగా, హాజరైన వారిలో పలువురి వద్ద సరైన ఆధారాలు లేవని అధికారులు గుర్తించారు.
అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విచారణ జరిపామని, 2016 మరియు 2022 నుంచి పింఛన్లు పొందుతున్న వారి వివరాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికులుగా పనిచేస్తున్నట్లు తగిన ఆధారాలు చూపని వారి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని, అనర్హులుగా తేలితే వారు ఇప్పటివరకు పొందిన పింఛన్ సొమ్మును రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. అయితే అర్హులైన కార్మికులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.
Also Read: Hidden Temple: సముద్ర గర్భంలో దాగి ఉండే మాయా దేవాలయం – అసలు రహస్యం తెలిస్తే షాక్ అవుతారు
గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్లు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజల నుంచి దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారి మోసపూరిత మాటలను నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారు నేరుగా అధికారులకు దరఖాస్తు చేసుకుంటే పింఛన్లు మంజూరవుతాయని, దీనిలో ఎవరి ప్రమేయం ఉండదని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సునీత, సర్పంచ్ రామారావు, ఉప సర్పంచ్ జగన్నాధం రాజు తదితరులు పాల్గొన్నారు.
Also read: వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే మెంతికూర పప్పు.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!