Sarpanch Elections: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, తిమ్మయ్యపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల్లో తల్లిపై కూతురు విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తల్లి గంగవ్వపై కూతురు పల్లెపు సుమ విజయాన్ని నమోదు చేసింది.
హోరాహోరీ పోరు.. చివరకు ఎన్ని ఓట్ల తేడాతో అంటే..?
తిమ్మయ్యపల్లి సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో తల్లి గంగవ్వ, కూతురు సుమల మధ్య తీవ్రమైన హోరాహోరీ పోరు నడిచింది. వ్యక్తిగత విభేదాల కారణంగా ఈ పోటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. కౌంటింగ్ అనంతరం పల్లెపు సుమ తన తల్లి గంగవ్వపై 91 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ అనూహ్య విజయం తిమ్మయ్యపల్లిలో పండుగ వాతావరణాన్ని తలపించింది.
తల్లి, కూతుళ్ల మధ్య ఎన్నికల పోరుకు ప్రధాన కారణం వారి కుటుంబ విభేదాలే. కూతురు పల్లెపు సుమ గతంలో తమ గ్రామానికే చెందిన ఒక యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయం ఇరు కుటుంబాల మధ్య తీవ్రమైన విభేదాలకు దారి తీసింది. అప్పటి నుంచి రెండు కుటుంబాలు దూరంగా ఉంటున్నాయి.
ఈ నేపథ్యంలో.. ప్రతిష్టాత్మకంగా మారిన సర్పంచ్ ఎన్నికల్లో తల్లిదండ్రుల కుటుంబం ఒకవైపు, కూతురు, అల్లుడి కుటుంబం మరొకవైపు నిలబడి ఢీకొన్నాయి. ఈ పోరులో సుమ గెలుపొందడం ద్వారా తన సత్తా చాటుకుంది. తిమ్మయ్యపల్లి సర్పంచ్ ఎన్నికల ఫలితం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలలో మరియు సామాన్య ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ విజయం పల్లె రాజకీయాల్లో వ్యక్తిగత సంబంధాలు, ఆధిపత్య పోరు ఏ విధంగా ప్రభావం చూపుతాయో మరోసారి స్పష్టం చేసింది.
ALSO READ: Top 20 News Today: పంచాయతీ పోలింగ్లో కాంగ్రెస్ జోరు.. మాచర్ల కోర్టులో పిన్నెల్లి లొంగుబాటు