CM Revanth reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం పర్మిషన్ ఇవ్వకపోవడంపై నిరసనలు క్రమంగా జోరందుకున్నాయి. కేంద్రంపై వివిధ వర్గాల నుంచి నిరసనలు క్రమంగా తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కేంద్రం నిర్ణయంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్-ఐఓసీ అమెరికా విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది కేంద్రం. ఈ నిర్ణయంపై తాము తీవ్రంగా నిరాశ చెందామని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్-ఐఓసి యూఎస్ఏ విభాగం తెలిపింది. ప్రస్తుతం లండన్లో ఉన్న ముఖ్యమంత్రి, ఆదివారం యూకే పర్యటనను ముగించుకుని అమెరికాకు వెళ్లాల్సి ఉంది. కేంద్రం అనుమతి నిరాకరణతో ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించింది.
గతంలో గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, తెలంగాణ సీఎం పట్ల వివక్ష చూపడం తగదని పేర్కొంది. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపేనని విమర్శించింది. అభివృద్ధి, విద్య, ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలను రాజకీయ కోణంలో చూడటం తగదని పేర్కొంది. కేంద్రం నిర్ణయం వల్ల తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు, విద్యాపరమైన భాగస్వామ్యాలకు ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. ముఖ్యమంత్రి పర్యటన రద్దయినప్పటికీ అధికారుల బృందం యథావిధిగా జరగనుంది. రాజకీయ అనుమతి నిరాకరించబడవచ్చని, కానీ తెలంగాణ ఆకాంక్షలను ఎవరూ కాదనలేరని పేర్కొంది.
ALSO READ: ఉపరితల ఆవర్తన ద్రోణి.. ఏపీ-తెలంగాణల్లోని వర్ష సూచన, హైదరాబాద్ పరిస్థితి ఏంటి?
తెలంగాణ రైజింగ్ వెనుక ఉన్న ఊపు కొనసాగుతుందని ప్రస్తావించింది. సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో హార్వర్డ్, ఎంఐటీ, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ప్రతినిధులతో భేటీ కావాల్సి వుందని పేర్కొంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, విద్యాపరమైన అవకాశాలను పెంపొందించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ముఖ్యమంత్రి హోదాకు, పర్యటన లక్ష్యానికి తగిన స్థాయిలో కార్యక్రమాలు లేవంటూ కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది.