Telangana Auto and Cab Strike: తెలంగాణలో ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల సేవలకు బ్రేక్ పడనుంది. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 18 సంఘాలతో కూడిన జేఏసీ నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. ఇవాళ (ఆదివారం) అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ బంద్ ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం నుంచి రోజువారీ ప్రయాణాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆటో, క్యాబ్ సంఘాల జేఏసీ ఆరోపిస్తోంది. తమ సమస్యలపై పలుమార్లు విజ్ఞప్తి చేసినా సరైన స్పందన రాలేదని సంఘాల నాయకులు చెబుతున్నారు. ఆటో, ప్రైవేట్ రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పినా అమలు కాలేదని అంటున్నారు. బకాయిలతో సహా ఆ మొత్తాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో అమలు చేసిన రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. రోడ్లపై నిరంతరం వాహనాలు నడిపే తమకు ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని, అందువల్ల బీమా భద్రత అవసరమని చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా తమ ఖర్చులు పెరుగుతున్నాయని డ్రైవర్లు అంటున్నారు. ఇంధన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ ఛార్జీలను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు.
బైక్ ట్యాక్సీల అంశం కూడా ఈ బంద్ లో ప్రధాన డిమాండ్గా మారింది. అక్రమంగా నడుస్తున్న బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని జేఏసీ కోరుతోంది. ప్రయాణికుల రవాణా కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తోంది. యాప్ ఆధారిత క్యాబ్ సేవల వల్ల కూడా తమ ఆదాయంపై ప్రభావం పడుతోందని కొందరు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే పథకం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిందని జేఏసీ నాయకులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ప్రయాణికులు ఆటోలను తక్కువగా ఉపయోగిస్తున్నారని, దీంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత మూడేళ్లలో సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు బలవన్మరణాలకు పాల్పడ్డారని జేఏసీ సభ్యులు వెల్లడించారు. డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో సుమారు 7.5 లక్షల మంది రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని సంఘాలు చెబుతున్నాయి. బంద్ కారణంగా సాధారణ ప్రయాణికులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆటోలు, క్యాబ్లపై ఆధారపడే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రవాణా కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడవచ్చు.
తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి పరిష్కారం చూపాలని జేఏసీ కోరుతోంది. స్పందన లేకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. అవసరమైతే అసెంబ్లీ, ప్రజాభవన్ ముట్టడికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం.. రవాణా సంఘాల మధ్య చర్చలు జరుగుతాయా? ఎలాంటి హామీలు పొందే అవకాశం ఉంది? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Read Also: జపాన్లో భారీ భూకంపం.. ఒక్కసారిగా నిలిచిన రైళ్లు!