E-Paper
Advertisement

TRS : కేంద్రంపై యుద్ధమే.. పార్లమెంట్ లో టీఆర్ఎస్ వ్యూహం ఇదేనా..?

TRS : కేంద్రంపై యుద్ధమే.. పార్లమెంట్ లో టీఆర్ఎస్ వ్యూహం ఇదేనా..?
Advertisement

TRS : కేంద్రంపై తాడాపేడో తేల్చుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఒకవైపు తెలంగాణ మంత్రులు టార్గెట్ గా ఈడీ, ఐటీ రైడ్స్ జరిగాయి. మరోవైపు ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థలు టీఆర్ఎస్ నేతలపై ముప్పేట దాడికి దిగుతున్నాయి. అయినా సరే కేసీఆర్ వెనక్కి తగ్గేదే లే అంటున్నారు. కేంద్రంతో ఇక యుద్ధమే అంటున్నారు. పార్లమెంట్ లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

డిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ, కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పార్లమెంట్ లో గళమెత్తాలని ఎంపీలకు నిర్దేశించారు. కేంద్ర నిరంకుశ విధానాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులపై ఉభయ సభల్లో నిలదీయాలని స్పష్టంచేశారు. జాతీయస్థాయిలో ఇతర పార్టీలతో కలిసి పోరాడాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయాలన్నారు.

Advertisement

ఎమ్మెల్యేలకు ఎర వేసిన అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని కేసీఆర్ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని దేశంమొత్తం తెలియజెప్పాలని ఎంపీలకు నిర్దేశించారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న తెలంగాణపై కేంద్రం విషం చిమ్ముతోందని మండిపడ్డారు. వివక్ష, ఆంక్షలతో ప్రగతిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతోందన్నారు. కేంద్రం నిర్వాకం వల్ల రాష్ట్రం ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ. 40 వేల కోట్ల రాబడి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తెలంగాణకు కేంద్రం చేసిన అన్యాయాలు, విభజన హామీల అమలులో వైఫల్యాలపై పార్లమెంట్ లో తీవ్రస్థాయిలో నిరసనలు తెలియజేయాలని ఎంపీలకు సూచించారు. పార్లమెంట్ బయటా ఆందోళనలు చేపట్టాలని స్పష్టం చేశారు.

కేంద్రం విపక్షాలు లక్ష్యంగా ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా దాడులకు పాల్పడుతోందని కేసీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వాలను కూలగొట్టేందుకు వాటిని సాధనాలుగా మార్చుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ‘ఎమ్మెల్యేలకు ఎర’ గుట్టును రట్టుచేయడంతో ప్రతిగా సీబీఐ, ఐటీ, ఈడీలను రంగంలోకి దింపిందని విమర్శించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై గురిపెట్టిందన్నారు. తెలంగాణతోపాటు అన్ని రాష్ట్రాల్లో కేంద్రం ఇదే వైఖరిని అనుసరిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలతో కలిసి పార్లమెంట్ లో ఈ అంశంపై గళమెత్తాలని ఎంపీలకు కేసీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

తెలంగాణ సచివాలయానికి బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని నిర్ణయించామని, పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేయాలని ఎంపీలకు కేసీఆర్ నిర్దేశించారు. గిరిజన, ముస్లిం రిజర్వేషన్ల పెంపు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ కోసం చేసిన శాసనసభ తీర్మానాలను ఆమోదించకపోవడం, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడం లాంటి అంశాలపై గళమెత్తాలని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ కు త్వరలో బీఆర్ఎస్ గా గుర్తింపు రాబోతోందని కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ సమస్యలనూ పార్లమెంట్ లో ప్రస్తావించాలని ఎంపీలకు నిర్దేశించారు. విభజన హామీల అమలు స్థితిగతులు, రాష్ట్రం పన్నుల రూపేణా కేంద్రానికి జమ చేస్తున్న నిధులు, కేంద్రం నుంచి తిరిగి వస్తున్న నిధులు, కేంద్ర బకాయిలు, వివిధ రాష్ట్రాలకు ఇచ్చిన కొత్త ప్రాజెక్టులపై సమగ్ర సమాచారంతో కూడిన పుస్తకాలను సీఎం ఎంపీలకు అందజేశారు. మొత్తంమీద కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే సూత్రాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారు. మరి పార్లమెంట్ లో కారు స్పీడ్ కు బీజేపీ ఎలా బ్రేకులు ఏస్తుందో చూడాలి మరి.

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×