Kalvakuntla Kavitha: జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాట కార్యక్రమం పూర్తిగా రాజకీయాలకు అతీతమై కొనసాగుతోందని.. కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బిగ్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె జనం బాట కార్యక్రమం ఉద్దేశాలు, రాష్ట్రంలో రైతులు, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా మాట్లాడారు.
ప్రజల సమస్యల కోసం మాత్రమే జాగృతి జనం బాట కొనసాగుతోందని కవిత స్పష్టంగా చెప్పారు. ప్రతి జిల్లాలో పెండింగ్లో ఉన్న సమస్యలను గుర్తించి, వాటిపై పోరాటం చేయడమే మా లక్ష్యం. సమస్యలను తెలుసుకోవాలంటే క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి. ప్రాజెక్టులను, వ్యవసాయ రంగాన్ని, ప్రజల జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాల్సిందే అని అన్నారు. జనం బాట ద్వారా ప్రజల గొంతుకగా నిలవాలని జాగృతి ప్రయత్నిస్తోందని ఆమె తెలిపారు.
ప్రాజెక్టుల పరిశీలన వల్లే అసలు సమస్యలు బయటకు వస్తాయని కవిత అభిప్రాయపడ్డారు. పేపర్లలో చూపించే గణాంకాలు వేరు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు వేరు. ప్రాజెక్టులను ప్రత్యక్షంగా పరిశీలిస్తేనే నీటి సమస్యలు, సాగు ఇబ్బందులు, రైతుల కష్టాలు అర్థమవుతాయి. అందుకే జనం బాట కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టుల పరిశీలనకు ప్రాధాన్యం ఇస్తున్నాం అని వివరించారు.
పత్తి రైతుల కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కొత్త నిబంధనల పేరుతో రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఖర్చులు పెరిగాయి, దిగుబడి ధరలు తగ్గాయి. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం అని కవిత అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని కవిత విమర్శించారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం.. బీసీలకు అన్యాయం చేస్తోందని కవిత ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాకే MPTC, ZPTC ఎన్నికలకు వెళ్లాలి. ఇది బీసీల న్యాయమైన డిమాండ్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కన పెట్టి ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. ఇది బీసీలపై జరుగుతున్న అన్యాయం అని ఆమె స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం జరగే వరకు జాగృతి పోరాటం చేస్తుందని తెలిపారు.
జనం బాట కార్యక్రమం పూర్తిగా రాజకీయాలకు అతీతమని కవిత మరోసారి స్పష్టం చేశారు. ఇది పార్టీ రాజకీయాల కోసం కాదు. ప్రజల సమస్యల కోసం. ఎవరి సమస్యైనా, ఏ వర్గానికి సంబంధించినదైనా జాగృతి వాటిని లేవనెత్తుతుంది. ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడమే మా బాధ్యత అని చెప్పారు.
Also Read: కాంగ్రెస్ హామీలు అమలు చేయడంలో విఫలం.. ఎంపీ రఘునందన్ రావు విమర్శలు
రాజకీయ నాయకులపై కూడా కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు ప్రజలకంటే గొప్పవారు కాదు. ప్రజలే నాయకులను గొప్పవారిని చేస్తారు. ప్రజలకు సేవ చేయడమే రాజకీయ నాయకుల ప్రధాన కర్తవ్యం. ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే ప్రజలు వారికి తగిన సమాధానం ఇస్తారు అని వ్యాఖ్యానించారు.