Jangaon Municipal Elections: భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి మున్సిపాలిటిలో ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటాడో అనే చర్చకు ఫుల్స్టాప్ పెట్టారు. తాను ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటానని మున్సిపల్ కమీషనర్కు లేఖ రాసారు. ఈ మేరకు ఈనెల 13ననే తన లేఖను మున్సిపల్ కమీషనర్కు లేఖ అందజేడయంతో ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇంతకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ తన ఓటు హక్కును వినియోగించుకుంటారు అనుకుంటున్నారా.. జనగామ మున్సిపాలిటీలో. ఎంపీ లేఖ రాయడంతో ఇప్పుడు జనగామ మున్సిపాలిటి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక రంజుగా సాగనుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
జనగామ మున్సిపాలిటిలో ఈనెల 13న జరిగిన కౌంటింగ్లో బీఆర్ఎస్ కు 13 సీట్లు, కాంగ్రెస్కు 12సీట్లు, సీపీఎంకు 1, నలుగురు ఇండిపెండెంట్లు గెలిచారు. అయితే ఈ ఫలితాలతో జనగామలో హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్ పోత్తుతో గెలిచిన సీపీఎం చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నది. ఇప్పుడు గెలిచిన నలుగురు ఇండిపెండెంట్లు కీలకంగా మారడంతో రాజకీయం రసపట్టులో మునిగిపోయింది. ఇందులో ఇద్దరు బీఆర్ఎస్ టికెట్ ఆశపడి రాకపోవడంతో ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచారు. మారబోయిన పాండు కాంగ్రెస్కు సపోర్టు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఇక 5వవార్డు నుంచి గెలిచిన మిద్దెపాక భాస్కర్ బీ ఆర్ ఎస్ రెబెల్గా గెలిచారు. ఇక 8వవార్డు నుంచి సందుపట్ల మంజుల ఎవ్వరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేకపోతుంది.
Also Read: Telangana Municipal Elections: కరీంనగర్ కార్పొరేషన్ కాషాయమయం.. ఫలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి
23వ వార్డు నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన భూష పర్వతాలు నాటకీయ పరిణామాల నడుమ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి జై కొట్టారు. పర్వతాలు విజయం సాధించగానే కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్కు తరలించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నాయకులు కారులో పర్వతాలును హైదరాబాద్కు తీసుకుపోతుండగా, సమాచారం ఎమ్మెల్యే పల్లా చెవిన పడింది. దీంతో పల్లా రాజేశ్వరరెడ్డి భువనగిరిలో పర్వతాలు వెళుతున్న కారును అడ్డగించారు. దీంతో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే పల్లాకు నడుమ భారీ ఘర్షణే జరిగింది. ఈ క్రమంలో పోలీసులను ఎమ్మెల్యే పల్లా ఆశ్రయించడం, పోలీసులు పర్వతాలును ఎటువైపు వెళుతావో తేల్చుకో అనగానే తాను పల్లాతో వెళతాననడంతో పోలీసులు పర్వతాలును పల్లాకు అప్పగించారు. దీంతో ఎంపీ చామల బృందం ఏమి చేసేది లేక వెనుదిరిగారు.
జనగామ మున్సిపాలిటీలో ఏర్పడటం, నలుగురు ఇండిపెండెంట్లు కీలకం కానుండగా, ఎక్స్ ఆఫిషియో మెంబర్ల ఓట్లు అత్యంత కీలకం కాబోతున్నాయి. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ మున్సిపాలటీలో ఓటు కోసం మున్సిపల్ కమీషనర్కు లేఖ రాయడం జరిగింది. ఇక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తాను ఇక్కడే ఓటు వేస్తారు. ఇక మిగిలింది జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీల్లో ఎవ్వరు ఎక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటారో అనేది ఈ రోజుతో తేలిపోతుంది. ఈ రోజు సాయంత్రం వరకు ఎక్స్ ఆఫిషియో గా లేఖలు ఇచ్చిందుకు సమయం ఉందని జనగామ మున్సిపల్ కమీషనర్ మహేశ్వరరెడ్డి తెలిపారు.
ఈలెక్కన తీన్మార్ మల్లన్న, తక్కళ్లపెల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పింగిళీ శ్రీపాల్ రెడ్డి లు తమ ఓటు హక్కును ఎక్కడ వినియోగించుకుంటారో తేలాల్సి ఉంది. ఇందులో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కళ్ళపెల్లి రవీందర్రావు లు ఇద్దరు బీ ఆర్ ఎస్ కు చెందినవారే. ఇక తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచింది కాంగ్రెస్లోనే అయినా, తాను సొంతంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇక్కడ ఆయన ఓటరుగా నమోదు చేసుకుంటారా లేదా.. చేసుకుంటే కాంగ్రెస్కు ఓటు వేస్తారా వేయరా అనేది ఈ రోజుతో తేలిపోనున్నది. ఇక పింగిళి శ్రీపాల్ రెడ్డి టీచర్ ఎమ్మెల్సీగా గెలిచారు. అయితే ఆయన ఇక్కడ ఓటరుగా నమోదు చేసుకుంటారా లేదా తేలాల్సి ఉంది.