Jangaon Municipality: స్వేఛ్చ బ్యూరో: జనగామ మున్సిపాలిటీ హంగ్ రావడం కౌన్సిలర్ల పాలిట వరంగా మారింది. ఇప్పుడు కౌన్సిలర్లు కోటి ఆశలతో ఉన్నారు. ఎవ్వరి మద్దతు కావాలో వారు ఇస్తే పదవి, లేకుంటే కాసులు అనే చందంగా బేరసారాలు సాగుతున్నాయని తెలుస్తుంది. బీ ఆర్ ఎస్ నుంచి 13మంది, కాంగ్రెస్ నుంచి 12, సీపీఐ ఎం కు ఒకరు గెలిచారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరో నాలుగు స్థానాలు ఇండిపెండెంట్లు గెలిచారు. దీంతో జనగామ మున్సిపాలిటీలో బీ ఆర్ ఎస్కు, కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఇండిపెండెంట్లుగా నలుగురు గెలవడంతో ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చేసుకున్న స్వయంకృపరాదం, కాంగ్రెస్ నేతల అనైక్యతతో నలుగురు ఇండిపెండెంట్లు గెలిచారనేది సుస్పష్టం. బీ ఆర్ ఎస్, కాంగ్రెస్లు చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే ఇండిపెండెంట్లు కీలకం కావడంతో వారి దశ తిరిగిందనే చెప్పాలి.
ఇండిపెండెంట్లుగా గెలిచిన వారు ఇప్పుడు కోటీ ఆశలతో ఉన్నారు. ఇండిపెండెంట్లు అవసరం అయిన రెండు పార్టీల నేతలు వారితో మంతనాలు జరుపుతున్నారు. దానికి వారు కొండెక్కి కూర్చున్నారు. పదవి ఇస్తారా మీకు సపోర్టు చేస్తాము.. లేదా ఇచ్చేవారికి మా మద్దతు ఇస్తామంటున్నారు. పదవి కాదంటే.. ఎన్నికల్లో గెలిచేందుకు చాలా ఖర్చు చేశాము. ఆ ఖర్చులు భరిస్తే.. ఆవి మాకు ఇస్తే సరే లేకుంటే మా దారి మేము చూసుకుంటామంటూ ఖరాఖండిగానే చెపుతున్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్లుగా గెలిచిన వారికి జాక్పాట్ తగిలిందనే ప్రచారం సాగుతుంది. పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన వారికన్నా ఇండిపెండెంట్లుగా గెలిచినవారి దశే బాగుందని అనుకుంటున్నారు.
బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు. జనగామలో ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ నాకు బార్ అనుమతి ఇస్తే చాలు.. నాకు కాసులు వద్దు అని ఖరాఖండిగా చెప్పారట. దీంతో ఆయన మద్దతు అవసరమున్న పార్టీ నాయకులు సరే అన్నారని లోకం కోడై కూస్తుంది. ఇండిపెండెంట్లుగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ ఖర్చులను పూడ్చుకునే పనిలో ఉన్నారని వినికిడి. ఏదేమైనా ఇండిపెండెంట్లు కోటి ఆశలతో ఉన్నారన్నది ప్రజల అబిప్రాయం. దానికి ప్రధాన పార్టీల నాయకులు కూడా మీ కోటీ ఆశలను తీర్చేందుకు సిద్దమే అని తలాడిస్తున్నారు. ఎందుకంటే జనగామ మున్సిపాలిటీపై తమ పార్టీ జెండా ఎగురాలన్నదే వారి ప్రధాన ఆశయం. ఇప్పుడు కౌన్సిలర్లు ఎలా ఉన్నారంటే మీకు మా అవసరం.. ఇది మాకు అవకాశం అన్నట్లుగా ఉన్నారన్నది నిజం.
జనగామ చైర్మన్ గిరి దక్కించుకునేందుకు రెండు పార్టీలకు చెందిన ఓ వైపు యుద్ధం చేస్తుంటే మరో వైపు గెలిచిన కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్ పదవి కోసం కుస్తిపట్లు పడుతున్నారని సమాచారం. గెలిచిన కౌన్సిలర్లతో రెండు ప్రధాన పార్టీల నాయకులు క్యాంపులు నిర్వహిస్తున్నారు. చైర్మన్ పదవిని ఆశిస్తున్న కౌన్సిలర్లు క్యాంపుల ఖర్చులు భరిస్తున్నారని టాక్. చైర్మన్ పదవి పొందితే మాకేంటి లాభం అని స్వపక్షంలోని కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారట. మాకు ఖర్చులు అయ్యాయి. వాటిని ఎవ్వరు తీర్చాలి. మీరు చైర్మన్ అయితే మాకేంటి లాభం అనే తీరుతో పంచాయతీలు నడుస్తున్నాయట. వీటికి తోడు క్యాంపుల్లోనూ సరైన తీరుగా చూసుకోవడం లేదని అలుగుడు గులుగుడు ఉండనే ఉన్నాయట. ఏదేమైనా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పొందేవారు ఇప్పుడు పడుతున్న యాతన మామూలుగా లేదట. స్వపక్షంలోనే విపక్షంలా ఉన్న కౌన్సిలర్లను బుజ్జగించే పనిలో నాయకులు, పదవులు ఆశిస్తున్నవారు ఉన్నారట. ఏదేమైనా ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలతో వీటన్నింటికి తెర పడుతుందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.
Also Read: AK47 Movie: త్రివిక్రంకు కోపం తెప్పించిన ‘ఏకే 47’ సినిమాటొగ్రఫర్.. ఏం చేశారంటే?