జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం మేడిపల్లి టోల్ గేట్ సమీపంలో శుక్రవారం ఒక కారు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. వరంగల్ నుండి మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనం ముగించుకుని.. కాళేశ్వరం వైపు వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
కారు మేడిపల్లి టోల్ గేట్ వద్దకు చేరుకోగానే ఇంజిన్ నుండి ఒక్కసారిగా పొగలు రావడం గమనించిన డ్రైవర్, వెంటనే అప్రమత్తమై కారును నిలిపివేశాడు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు క్షణాల్లో కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వారు కారు దిగిన నిమిషాల వ్యవధిలోనే మంటలు కారు మొత్తానికి వేగంగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
స్పందించిన ఫైర్ సిబ్బంది..
సమాచారం అందుకున్న వెంటనే కాటారం పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ.. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడారం దర్శనం ముగించుకుని సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగిన ఈ ఘటనతో బాధితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయినప్పటికీ, ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.