తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధరణి, భూ-భారతి డిజిటల్ రిజిస్ట్రేషన్ మోసం కేసులో వరంగల్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. అధునాతన సాంకేతికతను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న భారీ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు 15 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో 9 మంది పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
మోసం సాగిందిలా..
ఈ ముఠాకు ప్రధాన సూత్రధారులుగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఆన్లైన్ సర్వీస్ నిర్వాహకులు పసునూరి బసవరాజు, జెల్ల పాండులను గుర్తించారు. వీరు ఒక మొబైల్ అప్లికేషన్ను రూపొందించి.. దాని ద్వారా ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసే సమయంలో అసలు ఫీజు కంటే చాలా తక్కువ మొత్తాన్ని చెల్లించేవారు. ఆ తర్వాత, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ల సాయంతో పూర్తి స్థాయి ఫీజు చెల్లించినట్లుగా నకిలీ చలాన్లను సృష్టించేవారు. ఈ నకిలీ పత్రాలను మధ్యవర్తుల ద్వారా తహసీల్దార్ కార్యాలయాల్లో సమర్పించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేవారు.
కోట్లలో అక్రమార్జన
ఈ విధంగా జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మొత్తం 1,080 రిజిస్ట్రేషన్లలో ఫ్రాడ్ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీని ద్వారా సుమారు 3.90 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని నిందితులు కొల్లగొట్టారు. తమ నెట్వర్క్ను విస్తరించడానికి.. ఇతర ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులకు 10 నుంచి 30 శాతం వరకు కమీషన్ ఇస్తూ స్లాట్ బుకింగ్లు చేయించేవారు. ఈ వ్యవహారంపై జనగామ జిల్లాలో 7 కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి.
నిందితుల నుంచి పోలీసులు భారీగా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 63.19 లక్షల రూపాయల నగదు, కోటి రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్టాప్లు, 5 డెస్క్టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లు ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాలకు వాడుకుంటున్న ఇలాంటి ముఠాల పట్ల ప్రజలు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పరారీలో ఉన్న మిగిలిన 9 మంది కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.