టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఘోర పరాభవం ఎదురైంది. మూడు గ్రామాల్లో ఆమె బలపర్చిన అభ్యర్థులు ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారు. ఈ 3 గ్రామాల్లో.. ఝాన్సీ రెడ్డి సొంత గ్రామం చెర్లపాలెం కూడా ఉంది. చెర్లపాలెంలో ఝాన్సీ రెడ్డి అనుచరుడు కిరణ్ పై.. 80 ఓట్ల మెజారిటీతో రెబల్ అభ్యర్థి మహేందర్ గెలిచారు. మడిపల్లిలో ఝాన్సీ రెడ్డి బలపరిచిన అభ్యర్థిపై రెబల్ అభ్యర్థి భారీ విజయం సాధించారు. మడిపల్లిలో 750 ఓట్లతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి రామలింగం గెలిచారు. సోమారంలో రెబెల్ అభ్యర్థి లింగమూర్తి 92 ఓట్లతో గెలుపొందారు. సొంతపార్టీవారు సూచించిన అభ్యర్థిని కాదని, ఝూన్సీ రెడ్డి నిలబెట్టిన వ్యక్తిపై.. రెబల్ అభ్యర్థి విజయం సాధించారు.
గుర్తూరు గ్రామంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి ఇస్సంపెల్లి కవిత విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏర్పుల లలితపై విక్టరీ కొట్టారామె. ఇక, ఫతేపురం గ్రామంలో రెబెల్ అభ్యర్థి కుంభం మహేందర్ రెడ్డి విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా సొంత నిర్ణయంతో అభ్యర్థులను బరిలో నిలిపారు ఝాన్సీరెడ్డి. ఉపాధ్యక్షురాలిని అంటూ కామెంట్స్ చేశారు. తనకు తిరుగులేదని చెప్పుకొచ్చారామె. దీంతో.. అసమ్మతి వర్గం నేతలు అంతా ఒక్కటై రెబల్ అభ్యర్థుల్ని బరిలో దింపారు.