Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల నుంచి వచ్చిన స్పందనను బట్టి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు పెద్ద ఎత్తున మద్దతు లభించినట్లు స్పష్టమవుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి, తమ అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్లు తమ నాయకుల ద్వారా స్పష్టమైన సమాచారం అందిందని ఆయన తెలిపారు.
ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గత నెల రోజులుగా అవిశ్రాంతంగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు మహేష్ కుమార్ గౌడ్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ పార్టీ శ్రేణులను ముందుకు నడిపించారని కొనియాడారు. అదేవిధంగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ ఐక్యంగా కష్టపడ్డారని అన్నారు.
Read Also: Jubilee By-election Exit Poll: జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్.. అత్యంత భారీ మెజారిటీతో ఆ పార్టీ గెలుపు
మంత్రులు క్షేత్రస్థాయిలో ఉంటూ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను సమన్వయం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ సహా అన్ని అనుబంధ సంఘాల విభాగాల నాయకులు, సీనియర్ నాయకులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సంపూర్ణ విజయం సాధించారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్నారని, ఆ సంతోషమే ఓట్ల రూపంలో వ్యక్తమైందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో, నాయకులు మరియు కార్యకర్తల సమష్టి కృషితో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుస్తారని తాను బలంగా ఆశిస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో పునరుద్ఘాటించారు.