K Kavitha: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న 250 గజాల స్థలం కోసం మిలియన్ మార్చ్ ను తలపించే భూ పోరాటాన్ని చేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై విస్పష్ట ప్రకటన చేస్తారని భావించినా మరోసారి మోసం చేశారన్నారు.
కవిత మాట్లాడుతూ..
అనంతరం కవిత మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటంతో సిద్ధించిన తెలంగాణలో వారికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక పునాది వేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాం 12 ఏళ్లైనా హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకోకపోవడం అన్యాయమన్నారు. ఆగస్ట్ 6 లోపు జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
సీఎంపై కవిత ఫైర్
ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను సీఎం ఆవిర్భావ వేడుకల్లో కనీసం అంశాలను ప్రస్తావించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కేకే కమిటీ విధివిధానాలను కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. ఉప్పల్ భగాయత్ వేదికగా అతి పెద్ద ‘భూపోరాటం’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇది తెలంగాణ అస్తిత్వం, ఉద్యమకారుల ఆత్మగౌరవ పోరాటమని స్పష్టం చేశారు.
కవిత పిలుపు
ఈ మహా సంగ్రామానికి రాష్ట్రంలోని మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, ప్రజలు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటు కోసం తెలంగాణ జాగృతి సంస్థ 2014 నుంచే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. 2017 లో అప్పటి మున్సిపల్ శాఖకు కూడా అధికారికంగా లేఖ రాసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేన్నరేళ్లు గడుస్తున్న విగ్రహాం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ప్రభుత్వానికి కవిత లేఖ
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి అయిన ఆగస్ట్ 6 లోపు ట్యాంక్ బండ్ పై విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశామని కవిత చెప్పారు. తమకు అవకాశం ఇస్తే ఆ విగ్రహ ఏర్పాటుతో పాటు లైఫ్ టైమ్ మెయింటెనెన్స్ ను కూడా తామే చేపడతమన్నారు. తమకన్నా గొప్పగా ప్రభుత్వమే స్వయంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. రాష్ట్ర సాధనకు ప్రాణ త్యాగం చేసిన అమరవీరులు, ఉద్యమకారులను మది నిండా, ఆర్తితో గుర్తు చేసుకుంటున్నారు. ఉద్యమంలో ఆస్తులు, ఉద్యోగాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.
అమరవీరుడ కుటుంబానికి ఆర్థిక సాయం
అలాంటి వారందరినీ అన్ని విధాలా ఆదుకొని, సముచిత రీతిలో గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని కవిత అన్నారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి అమరవీరుడి కుటుంబానికి 1 కోటి రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మనమంతా సెకండ్ గ్రేడ్ పౌరులం కాదని నిరూపిస్తూ, ఎంతో స్వేచ్ఛగా బతికే చారిత్రక అవకాశం వచ్చిన రోజు జూన్ 2 అని చెప్పారు.
Also Read: రేవంత్ రెడ్డి టార్గెట్గా డీకే అరుణ ఫైర్.. సోనియా గాంధీ క్రెడిట్పై సంచలన వ్యాఖ్యలు!