KA Paul: మొన్న కౌన్సిల్ వేదికగా ఎమ్మెల్సీ కవిత కన్నీళ్లు పెట్టుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, ఆ కన్నీళ్ల వెనుక అసలు కారణం వేరే ఉందంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదంతా ప్రజల కోసం వచ్చిన దుఃఖం కాదని, కేవలం తండ్రి కేసీఆర్తో ఆస్తి పంపకాల గొడవలని ఆయన బాంబ్ పేల్చారు.
కవిత కూడా షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పవన్ కళ్యాణ్, చిరంజీవి తరహాలో ఒక ‘ప్యాకేజీ స్టార్’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత కన్నీళ్ల వెనుక అసలు కారణం ఆస్తి పంపకాలేనని పాల్ ఆరోపించారు. “పది లక్షల కోట్ల ఆస్తిలో ఆమెకు కేవలం రూ. 25 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. తనకు రావాల్సిన రూ. 2 లక్షల కోట్ల వాటా ఇవ్వమని తన తండ్రి (కేసీఆర్)తో ఆమె పోరాటం చేస్తున్నారు. పార్టీ పెట్టడానికి ఆమె వద్ద డబ్బు ఉంది.” అని పాల్ వ్యాఖ్యానించారు.
కొత్తగా పార్టీ పెట్టి బీసీ నినాదం ఎత్తుకుంటానంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కవితకు బీసీలు గుర్తురాలేదా అని ప్రశ్నించారు. బీసీల కోసం అప్పుడు ఎందుకు పోరాటం చేయలేదని నిలదీశారు.
చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్లో కలుపుతారని, పవన్ కళ్యాణ్ టీడీపీకి, షర్మిల కాంగ్రెస్కు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్కు అమ్ముడుపోతారని తాను ముందే చెప్పానని, ఇప్పుడు అదే జరిగిందని పాల్ గుర్తుచేశారు. ఇప్పుడు కవిత కూడా ఎవరికో ఒకరికి ‘బీ-టీమ్’గా మారుతారని ఎద్దేవా చేశారు. దళితులు, బీసీలు సొంతంగా పార్టీలు పెడితే మీడియా పట్టించుకోదని, కానీ అగ్రవర్ణాల పార్టీలకు తోక పార్టీలుగా ఉంటేనే కవరేజ్ ఇస్తారని మండిపడ్డారు.
తన పార్టీలో ఎప్పటి నుంచో నమ్మకంగా ఉన్న ప్రభాకర్ను ప్రజాశాంతి పార్టీ ‘నేషనల్ కోఆర్డినేటర్’గా నియమిస్తున్నట్లు పాల్ ప్రకటించారు. అద్దంకి దయాకర్ వంటి వారు అమ్ముడుపోయినా, ప్రభాకర్ మాత్రం నీతిగా నిలబడ్డారని కొనియాడారు.
తనపై పెట్టిన తప్పుడు కేసులన్నీ కోర్టులు కొట్టేస్తున్నాయని, వైఎస్ హయాంలో 58 కేసులు పెడితే 57 వీగిపోయాయని, మిగిలిన ఒక్క కేసు కూడా త్వరలో క్లోజ్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో నటుడు విజయ్ బీజేపీలో చేరనందుకే ఆయనపైకి సీబీఐని ఉసిగొల్పారని, తాను మాత్రం ఎన్ని రైడ్లు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసు డైలీ సీరియల్లా సాగుతుంది: ఎంపీ రఘునందన్