Raghunandan Rao: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిందని మండి పడ్డారు. బైకాట్ చేసి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పూర్తి వైఫల్యం చెందిందని విమర్శించారు. నీటి అంశాలపై చర్చకు పాలక పక్షం మీనమేషాలు లెక్కిస్తే.. బీఆర్ఎస్ భయపడి పారిపోయిందని ఆరోపించారు. తమ సంఖ్య తక్కువ ఉన్నా గట్టిగా పోరాడి పాలక పక్షాన్ని బీజేపీ నిలదీసిందని అన్నారు.
సీఎం మాట్లాడుతుంటే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం పాలమూరు ప్రాంతం, కృష్ణా జలాల పట్ల ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలియజేస్తుందని అన్నారు.
తమ పార్టీ తప్పిదాల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తప్ప.. రేవంత్ మహిమ ఏమి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి వివేక్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి కీలక నేతలు కాంగ్రెస్లో చేరడం వల్ల ఆ పార్టీ గెలిచిందని అన్నారు. తమ నుంచి కొంత మంది నాయకులు వలస వెళ్లినప్పుడే కాంగ్రెస్కు విజయావకాశాలు వచ్చాయని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు డైలీ సీరియల్లా సాగుతుందని, నిజాలను బయటపెట్టడం కన్నా రాజకీయ ప్రయోజనాలకే దర్యాప్తు వాడుతున్నట్లుగా అనిపిస్తోందని రఘునందన్ ఘాటు వ్యాఖ్యలు చేెశారు. తానే ఈ వ్యవహారంలో తొలి బాధితుడినని గుర్తుచేశారు. సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర నుంచి నేరుగా డేటా తీసుకుని తేల్చవచ్చు కదా అంటూ ప్రశ్నించారు.
ఇవాళ కొండల్ రెడ్డి, రేపు ఆయన డ్రైవర్ అంటూ రోజుకొకరిని పిలుస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని విమర్శించారు. సిట్ కాస్తా కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ CITగా మారినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కర్త, కర్మ ఒకరి వైపే వేలు చూపిస్తున్నప్పటికీ.. అసలైన వ్యక్తిని పిలిచేందుకు ప్రభుత్వం భయపడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల కోసం మాత్రమే ఈ నోటీసుల హడావుడి చేస్తున్నట్లుగా ఉందని విమర్శించారు.
కవిత కొత్త పార్టీపై మాట్లాడుతూ.. ఆమె పార్టీ పెడితే దేశంలో 6202వ పార్టీ అవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు కొత్త పార్టీ పెట్టినా బీజేపీ స్వాగతిస్తుందని, ప్రజాస్వామ్యంలో అది వారి హక్కని తెలిపారు.
Also Read: సంక్రాంతికి హౌసింగ్ కాలనీలో వారికి ఇళ్లు ఇస్తాం.. ఉత్తమ్ గుడ్ న్యూస్
ఒక నటుడు సినిమాకు టికెట్ల రేటు పెంచి మరొక నటుడికి పెంచకపోతే అది పక్షపాతం, అందరికీ ఒకటే రూల్ ఉండాలని అన్నారు. అలాగే రాజకీయాల్లోనూ, పాలనలోనూ కాంగ్రెస్ రెండు కొలమానాలు పాటిస్తోందని విమర్శించారు.