Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ అగ్రనేతలే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కేటీఆర్ చేసిన వ్యక్తిగత విమర్శలపై కడియం శ్రీహరి నిప్పులు చెరిగారు. “నేను ఆడో.. మగో.. తెలుసుకోవాలంటే స్టేషన్ ఘన్పూర్కి వచ్చి చూడు” అంటూ ఘాటుగా సవాల్ విసిరారు. నీ తండ్రి కేసీఆర్ కంటే తన వయస్సు పెద్దదని, పెద్దవారితో మాట్లాడే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. కేటీఆర్కు బలుపు, అహంకారం ఎక్కువని, అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం కావాలనే లక్ష్యం ఉండటం తప్పులేదని, కానీ ముందు భాష మార్చుకోవాలని హితవు పలికారు. సోషల్ మీడియాలో తన గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో వేల కోట్ల సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుందని, సొంత చెల్లి కవితనే మీ ఇంటి బాగోతం చెబుతోందని ఎద్దేవా చేశారు. తన సత్తా ఏంటో మొన్నటి ఎన్నికల్లో 143 సర్పంచ్ స్థానాలకు గాను 100 గెలిపించుకుని నిరూపించుకున్నానని కడియం స్పష్టం చేశారు.
మరోవైపు, చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ రామచందర్రావు సెటైర్లు వేశారు. కేసీఆర్ ఒక “ఓటీపీ” (OTP) లాంటి వారని, తెలంగాణలో ఇకపై ఇలాంటి ఓటీపీ పాలిటిక్స్ నడవవని స్పష్టం చేశారు. కొన్ని నెలల పాటు బయటకు రాకుండా ఉండి, ఇప్పుడు రాజకీయాలు మారలేదని అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని, ప్రజలు ఆ పార్టీని ఎప్పుడో మరిచిపోయారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని, ప్రజలు తమవైపే చూస్తున్నారని రామచందర్రావు ధీమా వ్యక్తం చేశారు.