Kaleshwaram Project: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ రూపొందించిన నివేదికను ఇవాళ ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. సీల్డ్ కవర్.. 500 పేజీల తుది నివేదిక.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రూపొందించిన రిపోర్ట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్ర సిద్ధంగా ఉంది. కమిషన్కు ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. దీంతో ఇవాళ లేదా రేపు ప్రభుత్వం ముందు నివేదికను ఉంచే అవకాశం ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చోటుచేసుకున్న లోపాలు, వాటి ఆధారాలతో నివేదికను సిద్ధం చేశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చోటుచేసుకున్న.. లోపాలు, వాటి ఆధారాలతో నివేదిక
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతోపాటు.. ఏడో బ్లాక్ పియర్స్ దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీల నేపత్యంలో.. గతేడాడి ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. కమిషన్ బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన వారందరినీ సుదీర్ఘంగా విచారించింది. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, నిర్మాణ సంస్థలు, నీటిపారుదల, ఆర్థిక శాఖల్లో పని చేసిన ఉన్నతాధికారులందరినీ విచారించింది. వారిచ్చిన అఫిడవిట్ల ఆధారంగా బహిరంగ విచారణ జరిపింది. అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాలతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పడంతో.. కేసీఆర్ను విచారించింది. అప్పటి మంత్రులు ఈటల, హరీష్ రావును కూడా ప్రశ్నించింది.
నిబంధనలకు విరుద్ధంగా అధికారుల నిధులు దుర్వినియోగం
బ్యారేజీల నిర్మాణంలో వైఫల్యాలపై ఇప్పటికే నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు కమిషన్ గుర్తించింది. ఐఏఎస్లు, ఇంజినీర్ల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు తేల్చింది. నాటి ప్రభుత్వ పెద్దలు నేరుగా క్షేత్రస్థాయి సిబ్బందితో సంప్రదింపులు చేయడంతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా పోయింది.
సక్రమంగా లేని రికార్డ్లు
రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదు. పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే డిజైన్ల మార్పు చేసినట్లు గుర్తించారు. హైలెవల్ కమిటీ అనుమతి లేకుండానే బడ్జెట్ రిలీజ్, డీపీఆర్ మార్పులు, మొదట్లో చెప్పిన డీపీఆర్, తర్వాత డీపీఆర్లో మార్పులు జరిగినట్లు తేల్చింది. మూడు బ్యారేజీలకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలను వేరువేరుగా పోందుపర్చింది. బహిరంగ విచారణ సందర్భంగా సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో అంశాలను చేర్చింది.
Also Read: నేడు ప్రభుత్వం ముందుకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్..
సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కమిషన్ నివేదిక
గతేడాది జూన్ నుంచి కమిషన్ ప్రత్యక్ష విచారణ చేపట్టింది. వందల అఫిడవిట్లు, బహిరంగ విచారణలు, ఎన్డీఎస్ఏ, కాగ్ నివేదికలు, విజిలెన్స్ రిపోర్ట్లను పరిశీలించింది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో గత ప్రభుత్వం ఆమోదించిన మంత్రి మండలి మినిట్స్, ప్రభుత్వం సమర్పించిన వేల పేజీల సమాచారాన్ని కమిషన్ పూర్తిగా పరిశీలించింది. అన్నింటి నుంచి కీలక ఆధారాలను కమిషన్ సేకరించింది. మూడు బ్యారేజీల్లో చోటుచేసుకున్న లోపాలు, వాటికి సంబంధించిన ఆధారాలతో నివేదికను సిద్ధం చేసిందని తెలుస్తోంది.