Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, దాని చుట్టూ జరుగుతున్న రాజకీయాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య నల్లగొండ వేదికగా తీవ్రమైన మాటల యుద్ధం చోటుచేసుకుంది. ప్రాజెక్టు వైఫల్యాలు, మరమ్మత్తులు, నీటి విడుదలపై ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.
కాళేశ్వరంపై దుష్ప్రచారం ఆపాలి.. ఉత్తమ్
బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం కట్టింది బీఆర్ఎస్.. కూల్చింది కూడా బీఆర్ఎస్ అంటూ మంత్రి ఉత్తమ్ కూమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు కాబట్టే కాంగ్రెస్ రిపేర్లు చేయడం లేదనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. వచ్చే జూలై నాటికి కాళేశ్వరాన్ని తిరిగి ఉపయోగంలోకి తెచ్చేందుకు ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నామని ఆయన ప్రకటించారు.
నిపుణుల నివేదికల ప్రకారం..
నిపుణుల నివేదికల ప్రకారమే తాము అడుగులు వేస్తున్నట్లు ఉత్తమ్ స్పష్టం చేశారు. అన్నారం, సుందిల్ల బ్యారేజీలు సరైన పునాది లేకుండా కట్టారని నిపుణులు చెబుతున్నారని, ఇప్పుడు గనుక ఆ బ్యారేజీల్లో నీళ్లు నిల్వ ఉంచితే అవి కూడా కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి అన్నారం, సుందిల్లలో నింపాలని బీఆర్ఎస్ అంటోందని, అలా చేస్తే ఆ బ్యారేజీలు కొట్టుకుపోతాయని హెచ్చరించారు. అందుకే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలకు పూర్తిస్థాయి టెస్టింగ్స్ జరిపిస్తున్నామని, రీ-డిజైనింగ్ చేయిస్తామని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ హయాంలోనే కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయిందని, మేడిగడ్డ దుర్ఘటన జరిగిందని గుర్తు చేస్తూ.. ఈ బ్యారేజీల కింద అసలు ఆనకట్టే లేదని ఉత్తమ్ విమర్శించారు.
మంత్రి ఉత్తమ్పై జగదీష్ రెడ్డి ఫైర్..
కాళేశ్వరం ప్రాజెక్టు పై మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం, ఉత్తమ్ కలిసి రాష్ట్ర రైతాంగానికి ద్రోహం చేస్తున్నారని అన్నారు. సుందిల్ల, అన్నారం ప్రాజెక్ట్ల్లో నీటిని నిల్వ చేసినా ఎలాంటి ప్రమాదం లేదు. ప్రభుత్వం కావాలనే150 TMC ల కాళేశ్వరం జలాలను వృధా చేసిందని అన్నారు. కన్నెపల్లి పంపు హౌస్ ను అప్పగిస్తే.. గతంలో ఉత్తమ్ ప్రాతినిధ్యం వహించిన కోదాడ వరకు సాగునీరు అందిస్తాంమని, విద్యుత్ బిల్లుల చెల్లాంచాల్సి వస్తుందనే కన్నెపల్లి పంపు హౌస్ రన్ చేయడం లేదని ఫైర్ అయ్యారు.
జగదీష్ రెడ్డి సవాల్..
కమిషన్ల కోసమే మేడిగడ్డ ప్రాజెక్ట్కు మరమ్మత్తులు చేయడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు చర్చించేందుకు ఎక్కడైనా సిద్ధమే అని మంత్రి ఉత్తమ్కు జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. కరువు పట్ల రేవంత్ ప్రభుత్వానికి సోయి లేదని దయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యం ఉందని, 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Also Read:కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!